లోక్ సభ ఎన్నికలకు మరో రాజకీయ కురువృద్ధుడు దూరం!
బెంగళూరు: మరో రాజకీయ కురువృద్ధుడు లోక్ సభ ఎన్నికలకు దూరం అయ్యారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదంటూ కేంద్ర మాజీమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవర్ ప్రకటించిన కొన్నిరోజుల వ్యవధిలో.. మరో సీనియర్ అదే బాటలో నడిచారు. ఆయనే మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్ డీ దేవేగౌడ. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని ఆయన ప్రకటించారు. తనకు బదులుగా.. ఎన్నికల బరిలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదరించాలని ఆయన కోరారు. హాసన జిల్లా హోళె నరసీపురలో ఏర్పాటుచేసిన కార్యక్రమం సందర్భంగా దేవేగౌడ విలేకరులతో మాట్లాడారు.
తన స్థానంలో మనవడిని నిలబెట్టిన దేవేగౌడ
కర్ణాటకలోని హాసన లోక్ సభ నియోజకవర్గం దేవేగౌడకు కంచుకోట. ఈ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన మొత్తం ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్ సభలోనూ ఆయన సభ్యుడే. హాసన నియోజకవర్గం నుంచే గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హాసన స్థానంలో తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ అభ్యర్థి ప్రకటించారు. తనకు బదులుగా ప్రజ్వల్ రేవణ్ణ పోటీలో నిలబెట్టినట్లు దేవేగౌడ వెల్లడించారు.
సీట్ల సర్దుబాటుపై అస్పష్టత..
కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని దేవేగౌడ వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించబోతున్నట్లు చెప్పారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్-9, జేడీఎస్-2 చోట్ల విజయం సాధించింది. మిగిలిన 17 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ తో పొత్తు ఉన్నందున.. ఈ రెండు పార్టీలు మధ్య సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి. తమకు 10 స్థానాలు కావాలని దేవేగౌడ ఇదివరకే కాంగ్రెస్ కు ప్రతిపాదించారు. దీనిపై న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ, దేవేగౌడ మధ్య ఓ దఫా చర్చలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 15న మరో దఫా చర్చలకు కూర్చుంటామని దేవేగౌడ వెల్లడించారు.