కర్ణాటక బంద్: బీజేపీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్, ఎవ్వరూ భయపడరు, కుమారస్వామి, డీకే!
బెంగళూరు: కర్ణాటక బంద్ చెయ్యడానికి తాము అవకాశం ఇవ్వమని, బీజేపీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కి ఇక్కడ ఎవ్వరూ భయపడేవారు లేరని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు. బీజేపీ చెప్పినట్లు అడటానికి ఇది తోడుబోమ్మలాట కాదని సీఎం కుమారస్వామి ఎద్దేవ చేశారు. ప్రభుత్వం ఏం చెయ్యాలో అది చేస్తోందని, బీజేపీ చెప్పినట్లు చెయ్యాలంటే ఇక్కడ కుదరదని హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు.
ఆట మొదలైయ్యింది
విశ్వాసపరీక్షలో విజయం సాధించిన హెచ్.డి. కుమారస్వామి తన కుర్చీకి ఎలాంటి ఢోకాలేదని అంటున్నారు. అసలైన ఆట ఇప్పుడు మొదలైయ్యిందని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చక్కటి అవకాశం వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
అధికారులతో సమావేశం
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, రాష్ట్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఐఎస్ఎన్. ప్రసాద్, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై కుమారస్వామి అధికారులతో చర్చించారని సమాచారం.
రుణ మాఫీలు ఏం చెయ్యాలి
జాతీయ, సహకార, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లోని రైతుల రుణాలు వెంటనే మాఫీ చెయ్యాలని బీజేపీ అల్టిమేటం జారీ చేసింది. అన్ని బ్యాంకుల్లోని రైతుల రుణాలు ఒకే సారి మాఫీ చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి భారం పడుతుంది అనే విషయంపై సీఎం కుమారస్వామి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది.
బీజేపీ బెదిరింపులు
మూడు రోజుల్లో రైతుల రుణమాఫీలు చెయ్యాలని కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు బీఎస్. యడ్యూరప్ప ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే సోమవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని యడ్యూరప్ప హెచ్చరించారు. బీజేపీ బుడ్డ బెదిరింపులకు ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరని సీఎం కుమారస్వామి ఘాటుగా స్పంధించారు. ప్రభుత్వానికి ఏం చెయ్యాలో తెలుసని, బీజేపీ నీతులు చెప్పనవసరం లేదని సీఎం కుమారస్వామి విరుచుకుపడ్డారు.
చూద్దాం అంటున్న డీకే
కర్ణాటక బంద్ నిర్వహించి ప్రజల సోమ్మును వృదా చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఉండేవాళ్లు ఎవ్వరూ లేరని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ అన్నారు. ప్రభుత్వం అనేక పథకాలు జారీ చెయ్యడానికి సిద్దం అయ్యిందని, ప్రజలకు ఏం చెయ్యాలో ప్రభుత్వానికి తెలుసని, బీజేపీ వేసే తాళానికి ఇక్కడ తల ఊపేవారు ఎవ్వరూ లేరని, కర్ణాటక బంద్ కు ప్రభుత్వ అనుమతి లేదని డీకే. శివకుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.