రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పి ఓపిక పోయింది, ఎన్నిసార్లు చెప్పాలి: సృతిమించితే, మాజీ సీఎం
బెంగళూరు: దేనికైనా హద్దు పొద్దు ఉంటుందని, సృతిమించితే మంచిది కాదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి రాజీనామా వెనక్కి తీసుకోమని నచ్చచెప్పి ఓపిక పోయిందని సిద్దరామయ్య చెప్పారు.
సమస్యలు చర్చించాలి !
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ కు రాజీనామా వెనక్కి తీసుకోమని చెప్పానని సిద్దరామయ్య అన్నారు. అనేక సార్లు ఆనంద్ సింగ్ తనతో భేటీ అయ్యారని సిద్దరామయ్య అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దగ్గర చర్చించి ఉంటే సమస్యలు పరిష్కరించడానికి తాను ప్రయత్నించే వాడినని సిద్దరామయ్య వివరించారు.
నేను నమ్మలేను
సమస్యలు గురించి చర్చించకుండా ఆనంద్ సింగ్ ఒకే సారి ఆయన పదవికి రాజీనామా చేసి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని సిద్దరామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. జిందాల్ కంపెనీకి భూమి కేటాయించడం వలనే తాను రాజీనామా చేశానని ఆనంద్ సింగ్ అంటున్నారని, అయితే తాను మాత్రం ఆ విషయంలో ఆయన మాటలు నమ్మనని సిద్దరామయ్య అన్నారు.
స్పీకర్ నిర్ణయం
తనకు స్పీకర్ రమేష్ కుమార్ మీద పూర్తి నమ్మకం ఉందని సిద్దరామయ్య అన్నారు. అయితే తాను మాత్రం రమేష్ జారకిహోళిని మాత్రం నమ్మేపరిస్థితిలో లేనని సిద్దరామయ్య చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేష్ కుమార్ ఓ నిర్ణయం తీసుకుంటారని సిద్దరామయ్య అన్నారు.
ఆపరేషన్ కమల
బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసి కాలం గడుపుతున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. ఆపరేషన్ కమలను తాము మొదలు పెట్టలేదని బీజేపీ నాయకులు అంటున్నారని, వారు చెబుతున్న మాటలు ఎవరూ నమ్మేపరిస్థితిలో లేరని సిద్దరామయ్య అంటున్నారు.
రాజీనామాలు వెనక్కి !
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఉమేష్ జాదవ్ తో రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకోలేదా అని సిద్దరామయ్య బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు చేసిన రాజీనామాలు వెనక్కి తీసుకుంటారనే తాను అనుకుంటున్నానని, అయితే కొన్ని రోజులు వేచి చూడాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.