నిర్బలను కాదు: కాంగ్రెస్ ఎంపీకి నిర్మలా సీతారామన్ కౌంటర్, చెత్త ఆర్థిక మంత్రినా?
న్యూఢిల్లీ: 'నిర్బల' అంటూ లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తనపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటైన సమాధానమిచ్చారు. తమ పార్టీలో ప్రతి ఒక్క మహిళా సబలేనని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ను నిర్బల సీతారామన్గా పేర్కొంటూ అధిర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.
'నేను నిర్బల(బలహీనం) కాదు. అంతేగాకు, మా పార్టీలో ప్రతి మహిళా సబలే(దృఢమైనవారే). నేను నిర్మలనే.. నిర్మలగానే ఉంటా. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళలంతా సబలలే. బీజేపీ పంచాయతీ స్థాయి నుంచి జాతీయ ఎగ్జిక్యూటివ్ వరకు ప్రతి మహిళా సబలే' అంటూ ధీటైన జవాబిచ్చారు నిర్మలా సీతారామన్.
తమ ప్రభుత్వం విమర్శలను వినేందుకు సిద్ధంగా ఉందని.. వాటిపై స్పందించేందుకు ప్రయత్నిస్తోందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆ విషయంపై స్పందించారు.
రాహుల్ బజాజ్కు అమిత్ షా చెప్పిన సమాధానాన్ని వెల్లడించారు. రాహుల్ బజాజ్ ప్రశ్నలు అడిగినప్పుడు తాను వేదికపైనే ఉన్నానని చెప్పారు. విమర్శల్ని వినాలి.. వాటిపై స్పందించాలన్న దృక్ఫథంతో తమ ప్రభుత్వం ఉందని అమిత్ షా చెప్పారని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీని, ఆయన పాలనను వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాట్లాడాలంటే ప్రజలు భయపడుతున్నారని అమిత్ షాతో రాహుల్ బజాజ్ అన్నారు. 'మీ ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది. కానీ, ఎవరైనా విమర్శలు చేస్తే మీరు ప్రశంసిస్తారన్న విశ్వాసం ఉండటం లేదు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంది. తమ మదిలో ఉన్న మాటను ఎవరూ బయటపెట్టలేకపోతున్నారు. యూపీఏ-2 ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ విమర్శలు చేసేవారు' అని రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాహుల్ బజాజ్ వ్యాఖ్యలపై అమిత్ షా సమాధానమిచ్చారు. ఏ విషయంలోనూ, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మోడీ ప్రభుత్వంపై నిరంతరం మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ, మీరు చెబుతున్నట్లు అలాంటి పరిస్థితి ఉంటే దాన్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.
పన్నుల సవరణ బిల్లుకు ఆమోదం
లోక్సభలో పన్నుల సవరణ బిల్లు - 2019 ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తనను ఎందుకు చెత్త ఆర్థికమంత్రి అంటున్నారు అని ప్రశ్నించారు. తన పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నారెందుకు? అని నిలదీశారు. అలాంటి వాళ్లు.. తనకు ఆలోచనలు, సూచనలు ఇవ్వండని.. వాటిపై పనిచేద్దామని అన్నారు. వినే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మోడీ ప్రభుత్వమేనని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ టాక్స్ మినహాయింపు చిన్న, పెద్ద వ్యాపారాలకూ ప్రయోజనం కలిగిస్తుందని ఆమె వివరించారు.