నేనేం షాక్ కాలేదు: ముఫ్తీ, అప్పుడే నిర్ణయం: రాంమాధవ్, కాశ్మీర్ పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టి
శ్రీనగర్: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడారు. పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న అనంతరం ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము జమ్ము కాశ్మీర్ పునర్నిర్మాణానికి కృషి చేశామని చెప్పారు.
బీజేపీ దెబ్బ, జమ్ము కాశ్మీర్లో కలకలం: ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా
తాను గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించానని చెప్పారు. అధికారం కోసం తాము బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. దీర్ఘకాలిక దృష్టితో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. పాకిస్తాన్తో చర్చల పునరుద్ధరణ జరగాలని మేం కోరుకున్నామని చెప్పారు. శాంతిని నెలకొల్పేందుకే కాల్పుల విరమణ కొనసాగించాలనుకున్నామన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నందునే బీజేపీతో పొత్తు
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందునే తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా తాము కమలం పార్టీ మద్దతు తీసుకున్నామని చెప్పారు. కామన్ అజెండా రూపొందించడానికి నెలల సమయం పట్టిందని చెప్పారు. బలవంతపు విధానాలు అమలు చేయడం ఏమాత్రం కుదరవని చెప్పారు. పాకిస్తాన్తో చర్చల పునరుద్ధరణ జరగాలని తాము కోరుకున్నామని ముఫ్తీ చెప్పారు. బీజేపీ తీరుతో నేనేం షాక్ కాలేదన్నారు. తాము మరో అలయెన్స్ కోసం చూడటం లేదన్నారు. ప్రత్యేక హోదా, కాల్పుల విరమణ, 370 ఆర్టికల్ కోసం పోరాడుతామన్నారు. పాక్తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించామన్నారు.
ఆ తర్వాతే ముఫ్తీ ప్రభుత్వంలో ఉండొద్దని నిర్ణయం
అంతకుముందు, బీజేపీ నేత రామ్ మాధవ్ జమ్ము కాశ్మీర్ పరిణామాలపై స్పందించారు. తాము మూడేళ్లు వేచి చూసినా జమ్ము కాశ్మీర్లో పరిస్థితి మారలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న స్థితిపై విభిన్న వేదికలపై బీజేపీ చర్చించిందన్నారు. దానిని విశ్లేషించడానికి తీవ్రంగా ప్రయత్నించామన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు సమీక్షించారన్నారు. వీటన్నింటి తర్వాత జమ్ము కాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ కొనసాగడం అసాధ్యమని నిర్ణయించామని చెప్పారు.
మా ప్రయత్నాలు మేం చేశాం
గత మూడేళ్ల కాలంలో జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వం సరిగా పరిపాలన సాగించేలా బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేసిందని రామ్ మాధవ్ అన్నారు. శాంతి, రాష్ట్రంలోని మూడు ప్రముఖ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకు వెళ్లాలి అనే ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు బీజేపీ కృషి చేసిందన్నారు. కానీ ఇటీవల అల్లర్లు, ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మెజార్టీ సీట్లు పీడీపీకి ఇచ్చారు కాబట్టి తాము అప్పుడు వారికి మద్దతు పలికామని, లేదంటే రాష్ట్రపతి పాలన వచ్చేదన్నారు.
పట్టపగలు దారుణ హత్య
రాష్ట్రంలో పౌరహక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం, హింస పెరిగాయన్నారు. తిరుగుబాట్లు వేగంగా వృద్ధి చెందాయన్నారు. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ సహా పౌరుల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని రామ్ మాధవ్ అన్నారు. నిజాయితీపరుడైన పాత్రికేయుడు సుజాత్ బుకారీ పట్టపగలే దారుణ హత్యకు గురికావడం మనం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన తీసుకువచ్చినా టెర్రరిజానికి వ్యతిరేకంగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.
జమ్ము కాశ్మీర్ పరిణామాలను పరిశీలిస్తున్న కేంద్ర హోంశాఖ
జమ్ము కాశ్మీర్ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడం, ఆ వెంటనే ఆమె రాజీనామా చేయడం, ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా గవర్నర్ను కలిసి గవర్నర్ పాలన కోరడం.. ఇలా పరిణామాలు వేగంగా మారాయి. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ బాగా పాల్గొన్నారు. జమ్ము కాశ్మీర్లోని పరిణామాలను కేంద్ర హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. గవర్నర్ నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించింది.