జాతీయగీతం పట్ల మీ గౌరవం ఇదేనా, సంతోషంగా ఉంది: యడ్యూరప్ప రాజీనామాపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: బీజేపీ నేత యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారు. యెడ్డీ రాజీనామా అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు జాతీయ గీతాన్ని అవమానించారని చెప్పారు.
ఓ వైపు జనగణమన చదువుతుంటేనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారన్నారు. జాతీయ గీతం పట్ల బీజేపీకి ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం పేరుతో ప్రధాని మోడీ దేశాన్ని వంచిస్తున్నారని చెప్పారు.
ఆరెస్సెస్, బీజేపీకి ఈ ఫలితం గుణపాఠం అన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్య పరిరక్షణలో సుప్రీం కోర్టు ప్రధాన పాత్ర పోషించిందన్నారు. విపక్ష ఎమ్మెల్యేలను కొనమని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపడం ఏమిటన్నారు. బీజేపీకి ఈ గుణపాఠం తనకు సంతోషం కలిగించిందన్నారు.
సంఖ్యా బలం లేకపోవడం వల్ల సీఎం, స్పీకర్ ముందే వెళ్లిపోయారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు మోడీ, అమిత్ షా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారన్నారు. తాము చట్టానికి అతీతులమని వారు అనుకుంటున్నారని చెప్పారు.
మణిపూర్, గోవాలలో ప్రజా తీర్పును బీజేపీ గౌరవించలేదన్నారు. కర్ణాటకలో ప్రజలు బీజేపీని సమర్థించలేదన్నారు. దేశంలో ప్రతి వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందన్నారు. దేవేగౌడకు రాహుల్ అభినందనలు తెలిపారు. ఆరెస్సెస్ అన్నింటా చొచ్చుకు వస్తోందన్నారు. బీజేపీన ఓడించేందుకు విపక్షాలు ఒక్కటి కావడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇలాగే ముందుకు సాగుతామన్నారు.