రాజీవ్ హత్య: జయలలిత నిర్ణయంతో రాహుల్ హర్ట్
న్యూఢిల్లీ: రాజీవ్ హంతకుల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విచారం వ్యక్తం చేశారు. హంతకులను విడుదల చేస్తుండటం బాధాకరమని, ప్రధానిని హత్య చేసిన వారే విడుదలైతే ఇక సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయమన్నారు. ఈ దేశంలో ప్రధానికే న్యాయం జరగడం లేదని తన మనసు అంటోందన్నారు. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం పట్ల కలత చెందానన్నారు. దేశం కోసం తనను తాను త్యాగం చేసుకున్న ప్రధానికే న్యాయం జరగడం లేకుంటే ఎలా అని అభిప్రాయపడ్డారు.
అయితే మరణశిక్షకు మాత్రం తాను వ్యతిరేకమని, దాని వల్ల తన తండ్రి తిరిగి రాడని ఆయన అన్నారు. ఈ వ్యవహారం కేవలం తన తండ్రికి సంబంధించిందే కాదని, దేశానికి సంబంధించినదన్నారు. రాజీవ్ హంతకుల మరణశిక్షను జీవిత ఖైదుకు తగ్గించడంపై తాను సంతోషంగా లేనని చెప్పలేనని, అయితే రాజీవ్ మరణంతో కలిగిన బాధ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.
కాగా, రాజీవ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. క్షమాభిక్ష ఇవ్వడంలో ఆలస్యమైందనే కారణంగా రాజీవ్ హత్య కేసులో దోషులకు విధించిన మరణ శిక్షను జీవితఖైదుగా మారుస్తూ సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు దోషులను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. మిగితా వారిని కేంద్రాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరారీవాలన్, మురుగన్, శాంతన్లను విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాజీవ్ హత్య కేసులో మరో నలుగురు దోషులైన నళిని, రాబర్ట్ ప్యాస్, జయకుమార్, రవిచంద్రన్ కూడా జీవిత ఖైదును అనుభవిస్తున్నారు.
వీరిపై కేంద్రంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రివర్గం ప్రకటించింది. మూడు రోజుల్లోగా కేంద్రం ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. భారత రాజ్యాంగం ప్రకారం నిందితులందర్నీ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. హంతకులను విడుదల చేయాలని నిర్ణయించడం సరైన చర్య కాదని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎన్ఆర్ రంగరాజన్ అన్నారు. అయితే ఏదైనా కేసులో ఎవరైతే 14 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి ఉంటారో, ఆ సమయంలో వారి సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.