జిహాదీలు నన్ను టార్గెట్ చేసుకున్నారు: అస్సాం సిఎం
గౌహతి: రాష్ట్రంలోని జిహాదీ ఉగ్రవాద శక్తులు తనను హతమార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ పేర్కొన్నారు. ‘రాష్ర్టానికి జిహాదీ శక్తులనుంచి ముప్పు పొంచి ఉంది. ఆ జాబితాలో నేనూ, రాష్ట్ర సచివాలయం, ప్రఖ్యాత కామాఖ్య ఆలయం మరికొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయి' అని తరుణ్ చెప్పారు.
నీలాచల్ కొండపైనున్న శక్తి ఆలయంలో ఆదివారం పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని జిహాదీలు, వారి కార్యకలాపాలకు సంబంధించిన కేసులన్నీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించినట్లు చెప్పారు.
సివిసి కార్యదర్శిగా అలోక్ కుమార్
న్యూఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అలోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అస్సాం- మేఘాలయ క్యాడర్కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి (శిక్షణ) బాధ్యతలను కూడా అదనంగా స్వీకరించారు.
కుమార్ ఈ అదనపు బాధ్యతలను ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు కాని, మరో అధికారిని నియమించే వరకు కాని నిర్వహిస్తారని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసిసి) కేంద్రంలో కుమార్ డిప్యుటేషన్ను మరో మూడు నెలలు పొడిగించింది. కుమార్ సివిసి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
కేరళ ఆర్థికమంత్రిపై విజిలెన్స్ విచారణ
తిరువనంతపురం: లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిపై రాష్ట్ర విజిలెన్స్శాఖ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. రాష్ట్రంలో మూసివేసిన 418 బార్ల లైసెన్సుల పునరుద్ధరణ కోసం మంత్రికి రూ.1 కోటి లంచం ఇచ్చినట్లు కేరళ హోటళ్లు, బార్ల సంఘం అధ్యక్షుడు బిజూ రమేశ్ ఓ టీవీ ఛానల్తో పేర్కొన్న నేపథ్యంలో విజిలెన్స్ శాఖ స్పందించింది.