కన్నుగీటిన రాహుల్: మర్చిపోలేనంటూ ప్రియా వారియర్, ఏమన్నారంటే..?
తిరువనంతపురం/న్యూఢిల్లీ: పార్లమెంట్ అవిశ్వాస తీర్మాన చర్చలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ప్రసంగం ముగిశాక ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకున్న విషయం తెలిసిందే.
పేలుతున్న జోకులు
ఆ తర్వాత రాహుల్ గాంధీ తన స్థానంలో కూర్చున్న తర్వాత తోటి నేతల వైపుగా తిరిగి కన్నుకొట్టారు. కాగా, ఇది కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
ప్రియా వారియర్కు ధీటుగా..
కాగా, ఇంటర్నెట్ సంచలనం, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ను మర్చిపోయేలా రాహుల్ కన్ను కొట్టారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రియా ప్రకాశ్ కూడా స్పందించింది.
చాలా సంతోషంగా ఉందంటూ ప్రియ
ప్రియా వారియర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కాలేజి నుంచి ఇంటికి తిరిగి రాగానే మా అమ్మ నాకీ విషయం చెప్పింది. దీంతో టీవీ చూశాను. ప్రధాని నరేంద్ర మోడీ సర్ ఉండగా పార్లమెంట్లో రాహుల్ సర్ కన్నుకొట్టారని వస్తోంది. సోషల్ మీడియాలో రాహుల్ సర్ను నన్ను పోల్చి చూపిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది' అని వ్యాఖ్యానించింది.
ఆయనతో పోల్చడం ఆనందం..
‘అంతపెద్ద వ్యక్తి(రాహుల్ గాంధీ)తో నన్ను పోల్చినందుకు సంతోషిస్తున్నా. ఈరోజు నాకు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. కొన్ని నెలల తర్వాత నా పేరు ఇంటర్నెట్లో మళ్లీ సంచలనం అవుతోంది' అని ప్రియా వారియర్ ఆనందం వ్యక్తం చేసింది.