తగ్గని విపక్షాలు: అంతకన్నా ఏం చేయాలన్న మంత్రి సాధ్వీ
న్యూఢిల్లీ: తన హేట్ స్పీచ్పై ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చిరాకు పడ్డారు. ఆ వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పానని అంతకన్నా ఏం చేయగలనని ఆమె అన్నారు. లోకసభలోనూ రాజ్యసభలోనూ తాను క్షమాపణలు చెప్పానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని, తాను విచారం వ్యక్తం చేశానని ఆమె అన్నారు.
ప్రతిపక్షాలు క్షమాపణకు డిమాండ్ చేశాయని, తాను క్షమాపణ చెప్పానని, అంతకన్నా ఏం చేయగలనని ఆమె అన్నారు. అయితే, సాధ్వీ నిరంజన్ జ్యోతి రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభలో ఆ విషయంపై తీవ్ర దుమారం చెలరేగింది మంత్రులు హుందాతో కూడిన వ్యాఖ్యలు చేస్తారని ఆశిస్తామని కాంగ్రెసు నేత ఆనంద శర్మ అన్నారు. ప్రధాని సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, ప్రధాని రాలేదని, తాము ఆందోళనకు గురవుతున్ామని ఆయన అన్నారు.
నిరంజన్ జ్యోతీ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే, ఆమెకు ఉద్వాసన పలికాలని బిఎస్పీ నేత మాయావతి అన్నారు. మంత్రి రాజీనామా చేయాలని, ఆమె వ్యాఖ్యలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు నోటీసు ఇస్తే ఈ విషయంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని బిజెపి సభ్యుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. తాము మాటలు జారకూడదని తమకు తెలుసునని, ప్రతిపక్ష నేతలు కూడా అలాగే ఉండాలని, ఆ విధమైన భాషను తాము సమర్థించడం లేదని ఆయన అన్నారు.
మంత్రి క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, బయట జరిగే విషయాలతో సభకు సంబంధం ఉండదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంత్రివర్గంలో ఉన్నంత వరకు ఈ సభ సాగదని సిపిఎం సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. గందరగోళం మధ్య రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది.
అంతకు ముందు, తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయం మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పారు. ఆమె వ్యాఖ్యలను ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రస్తావిస్తూ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆమె లోకసభలో క్షమాపణ చెప్పారు తాను ఆ వ్యాఖ్యలు చేశానని అంగీకరిస్తున్నానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని నిరంజన్ జ్యోతి అన్నారు. ఆమె వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా కొద్దిసేపు వాయిదా పడ్డాయి.
లోకసభ సమావేశం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను కాంగ్రెసు సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్లు స్పీకర్ చెప్పారు. ఆ అంశాలను జీరో అవర్లో లేవనెత్తవచ్చునని ఆమె సూచించారు.
జ్యోతి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని, ఉద్ర్రిక్తతలను రెచ్చగొట్టాయని ఖర్గే చెప్పారు. ఈ సమయంలో నినాదాలు చేస్తూ కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెసు సభ్యులు పలువురు వెల్లోకి దూసుకెళ్లారు. జ్యోతితో పాటు గిరిజా సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. గందరగోళం చెలరేగిన సమయంలో నిరంజన్ జ్యోతీ సభలో ఉన్నారు. గిరిజా సింగ్ మాత్రం కనిపించలేదు.