ఇక్కడి నుంచి భారత్కు వచ్చిన వలసదారుల జాబితా ఇవ్వండి: అబ్దుల్ మోమెన్
ఢాకా: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్కు వలస వచ్చిన వారి పూర్తి వివరాలతో కూడిన జాబితాను తమకు అందివ్వాల్సిందిగా భారత్ను కోరినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ చెప్పారు. భారత్ ఈ జాబితాను తమకు అందిస్తే అక్రమ వలసదారులను తిరిగి బంగ్లాదేశ్కు రప్పిస్తామని చెప్పారు.
బంగ్లాదేశ్-భారత్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పిన మోమెన్... ఎన్ఆర్సీ వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు చెరిగిపోలేదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ అనేది భారత అంతర్గత విషయమని చెప్పిన మంత్రి మోమెన్.. బంగ్లాదేశ్పై ఎలాంటి ప్రభావం చూపబోదని వివరించారు. పౌరసత్వ చట్టంతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్న నేపథ్యంలో గురువారం తన భారత పర్యటను వాయిదా వేసుకున్నారు ఏకే అబ్దుల్ మోమెన్.
ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనందున కొంతమంది బంగ్లాదేశీయులు మధ్యవర్తుల ద్వారా భారత్లోకి అక్రమంగా అడుగు పెడుతున్నారన్న భారత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అదే సమయంలో బంగ్లాదేశీయులు కాకుండా మరి ఇతర దేశాలకు చెందిన వారు బంగ్లాలో అడుగుపెడితే వారిని వెంటనే సొంత దేశాలకు పంపిస్తామని చెప్పారు అబ్దల్ మోమెన్.
ఇదిలా ఉంటే భారత పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారని అడుగగా... దేశంలో కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నందున తన భారత పర్యటన వాయిదా వేసుకోవడం జరిగిందని చెప్పారు. కానీ ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, హింసాత్మక వాతావరణంతోనే బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని భారత అధికారులు చెప్పారు.