పిల్లల్ని అలా చూపిస్తే ఊరుకోం.. ప్రైవేట్ టీవీ ఛానళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్..
ఢిల్లీ : టీఆర్పీల వేటలో టీవీ ఛానెళ్లు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం రియాల్టీ షోల కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చాయి. ఈ షోలకు డిమాండ్ ఉండటంతో టీవీ ఛానెళ్లు పోటీ పడి రియాల్టీ షోలు ప్రసారం చేస్తున్నాయి. మొదట్లో పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రోగ్రాంలలో ఇప్పుడు పిల్లలను భాగస్వాములను చేస్తున్నాయి. చిన్నారుల కోసం సింగింగ్, డ్యాన్స్ రియాల్టీ షోలు నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా పిల్లల రియాల్టీ షోలలో కంటెంట్పై కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలతో పాడిస్తున్న పాటలు, చెప్పిస్తున్న డైలాగ్లు ముఖ్యంగా డ్యాన్స్ రియాల్టీ షోలలో వారి కట్టుబొట్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల్లాగే పిల్లలతో డ్యాన్స్ స్టెప్పులు వేయిస్తుండటంపై కేంద్ర సమాచార ప్రసార శాఖకు పలు ఫిర్యాదులు అందాయి. వాటిపై స్పందించిన ఐబీ శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రియాల్టీ డ్యాన్స్ షోలలో పిల్లలను అసభ్యంగా చూపిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ఐబీ తన అడ్వైజరీలో డ్యాన్స్ షోలతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ పిల్లలను అనుచితంగా చూపించరాదని సమాచార శాఖ స్పష్టం చేసింది. సినిమాల్లో పెద్దలు చేసే డ్యాన్స్ స్టెప్పులు పిల్లలతో వేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సరైన పద్దతికాదని దానివల్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. కేబుల్ చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు ఛానళ్లు ఈ నిబంధన పాటించాలని స్పష్టం చేసింది. అలాంటి ప్రోగ్రాంలలో భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హింసాత్మక సన్నివేశాలు చూపించరాదని తేల్చిచెప్పింది.
2027 కల్లా చైనాను మించిపోనున్న భారత్ జనాభా...!