అమ్మవారి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మొక్కు తీర్చుకున్నా, హెచ్.డి. కుమారస్వామి!
మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు. భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించడం, అమ్మ అశీర్వదించడం వలనే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.
మైసూరు జిల్లా టీ. నరశీపురలోని మూగూరులో వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి శంకుస్థాపన చేశారు. ఈసందర్బంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ తాను 2018 శాసన సభ ఎన్నిక ప్రచార సమయంలో మూగురులోని శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానని గుర్తు చేశారు.
తాను ముఖ్యమంత్రి అయిన తరువాత మూగూరు ఆలయంలో అడుగుపెట్టి ప్రత్యేక పూజలు చేస్తానని ఆరోజు అమ్మవారికి మొక్కు చేసుకున్నానని సీఎం కుమారస్వామి అన్నారు. అనుకున్నట్లు అమ్మవారు ఆశీర్వదించడం, తాను ముఖ్యమంత్రి కావడం జరిగిందని కుమారస్వామి అన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో తాను శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకుని మళ్లీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి కారణం అయిన అమ్మ దేవాలయం అభివృద్దికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని, ఈ ఆలయం అభివృద్ది చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.
శ్రీ త్రిపుర సుందరి దేవి ఆలయం అభివృద్ది చెందితే వర్షాలు పడి పంటపోలాలు పచ్చగా ఉంటాయని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పనుల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చెయ్యాలని, రైతులు ఇక ముందు ఆత్మహత్య చేసుకునేందుకు తాము అవకాశం ఇవ్వమని, త్వరలో అన్ని సమస్యలు సర్దుకుంటాయని, అందరీకి శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు.