ఉద్విగ్నం..ఉద్వేగం: కోట్లాదిమంది భారతీయులకు సాష్ఠాంగ ప్రమాణం చేస్తున్నా: మోడీ
న్యూఢిల్లీ: సుమారు వారం రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశానికి చేరుకున్నారు. హౌడీ, మోడీ, ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశం సహా పలు సమావేశాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు శనివారం రాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు పార్టీ నాయకులు, కేంద్రమంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీలోని పాలమ్ టెక్నికల్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ప్రధానమంత్రిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. బాణాసంచాలను పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
చిరస్మరణయం.. సంతృప్తికరం
ఈ సందర్భంగా మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన అమెరికా పర్యటన ఆశించిన దాని కంటే సంతృప్తికరంగా సాగిందని అన్నారు. తాను చెప్పదలచుకున్న విషయాలను, సూటిగా, నిర్మొహమాటంగా అంతర్జాతీయ వేదిక ద్వారా ప్రపంచ దేశాలకు చాటి చెప్పానని పేర్కొన్నారు. హ్యూస్టన్ లో ఏర్పాటైన హౌడీ మోడీ కార్యక్రమానికి 50 వేల మంది భారతీయులు హాజరు కావడం ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇందులో పాల్గొనడం..తన పర్యటన విజయం సాధించిందనడానికి సూచిక అని అన్నారు.
కోట్లాదిమంది భారతీయులకు సాష్ఠాంగ ప్రమాణం..
అనుక్షణం తన వెంట ఉంటూ, మేమున్నామనే భరోసా ఇస్తోన్న కోట్లాది మంది భారతీయులకు తాను సాష్ఠాంగ ప్రమాణం చేస్తున్నానని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్విగ్నభరితులయ్యారు. తాను సాధించిన విజయాలేవీ తనవి కావని, ప్రతి భారతీయుడూ దీనికి అర్హుడని అన్నారు. 2014లో కూడా తాను ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యానని, ఈ అయిదేళ్ల కాలంలో ప్రపంచ దేశాధినేతల ప్రవర్తనలో చాలా తేడా కనిపించిందని అన్నారు. 2014 తరువాత వారిలో భారత్ అంటే గౌరవం పెరిగిందని చెప్పారు. మనదేశం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారని అన్నారు.