సీఏఏ నోటిఫికేషన్ అంగీకరించం, అదో పేపర్గానే..: సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ)పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను తాము గుర్తించమని, అది కేవలం పేపర్పైన మాత్రమే ఉంటుందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాము అమలు చేయబోమని అన్నారు.
సీఏఏను అంగీకరించం.. అదో పేపర్ మాత్రమే..
‘శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీఏఏను మేము అంగీకరించబోం. మేము అంగీకరించేది లేదు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)లను కూడా మేము అంగీకరించం. సీసీఏ నోటిఫికేషన్ కేవలం పేపర్లపైనే ఉంటుంది. ప్రజలు అంగీకరించడం లేదు' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
సీఏఏ నిరసనల్లో మమతా బెనర్జీ..
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అయిన తృణమూల్ ఛత్ర పరిషద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశానికి ముందు ఆమె ఇక్కడికి వచ్చి విద్యార్థులు చేస్తున్న దీక్షకు మద్దతు పలుకుతూ వారితోపాటు కూర్చున్నారు. విద్యార్థుల చేస్తున్న నిరసనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మమతా బెనర్జీ అన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ప్రధానితో మమతా భేటీ.. వామపక్షాల ఆందోళన
ఆ తర్వాత ఆమె మిలీనియం పార్క్కు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్నారు. హౌరా బ్రిడ్జిపై లైట్, సౌండ్ షోను ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత మళ్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, శనివారం రాజ్భవన్లో ప్రధానితో మమతా బెనర్జీ భేటీని వ్యతిరేకిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆజాదీ, షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. తృణమూల్ విద్యార్థులు చేస్తున్న దీక్ష వేదిక వద్ద ఆందోళన చేస్తూ బారికేడ్లను ధ్వంసం చేశారు. మోడీతో మమతా ఎందుకు భేటీ అయ్యారంటూ నిలదీశారు.
మోడీ వెళ్లిన కార్యక్రమానికి హాజరు కాని మమతా బెనర్జీ
కాగా, ది నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనగా.. సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎంగా ఆమె హాజరుకావాల్సి ఉండగా.. ఆమె పాల్గొనలేదు. కాగా, కోల్కతా పోర్ట్కు శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్గా నామకరణం చేశారు ప్రధాని మోడీ.