ఎట్టకేలకు మౌనం వీడిన శరద్ యాదవ్: బీజేపీకి షాకిచ్చిన జేడీయూ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీతో జేడీయూ పొత్తుపెట్టుకుని బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఇంతవరకు మౌనంగా ఉన్న ఆ పార్టీ సహ వ్యవస్థాపకులు శరద్ యాదవ్ ఎట్టకేలకు స్పందించారు. మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో పొత్తుపెట్టుకున్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్ణయాలపై గత కొన్ని రోజులుగా శరద్ యాదవ్ మౌనంగా ఉన్న విషయం తెలిసిందే.
దురదృష్టకరం
సోమవారం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన శరద్యాదవ్ బీహార్ రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. ‘బీహార్లో ఇటీవల జరిగిన పరిణామాలు దురదృష్టకరం. వాటిని నేను అంగీకరించబోను. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇది కాదు' అని అన్నారు.
Recommended Video
అసంతృప్తిగానే శరద్ యాదవ్..
కాగా, రెండేళ్ల మహాకూటమికి గుడ్బై చెప్పి.. నితీశ్ గతవారం బీజేపీతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో మళ్లీ అధికారాన్ని దక్కించుకున్నారు నితీశ్ కుమార్. శాసనసభలో బలాన్ని నిరూపించుకుని మరోసారి సీఎం అయ్యారు. కాగా, నితీశ్ బీజేపీ చేతులు కలపడంపై నిన్నటి వరకు శరద్యాదవ్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి.
బీజేపీ-జేడీయూకు వ్యతిరేకమే..
మరోవైపు శరద్యాదవ్ మాకే మద్దతిస్తున్నారంటూ మహాకూటమిలోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో నితీశ్ నిర్ణయానికి శరద్ యాదవ్ మద్దతిస్తున్నారా? లేదా వ్యతిరేకిస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శరద్ యాదవ్ ఆదివారం ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. కాగా, సోమవారం బీజేపీ-జేడీయూ పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.
బీజేపీ షాకిస్తూ జేడీయూ..
ఇది ఇలా ఉండగా, ఇటీవల బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తును తెగదెంపులు చేసుకున్నప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ వైఖరి మార్చుకోబోమని జేడీయూ స్పష్టం చేసింది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న గోపాలకృష్ణ గాంధీకే తాము ఓటు వేస్తామని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ స్పష్టం చేశారు. గోపాలకృష్ణ గాంధీకి ఓటు వేయాలని మహాకూటమి విచ్చిన్నానికి ముందు నిర్ణయించాం కాబట్టి, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఈ విషయాన్ని బీజేపీకి కూడా తెలియజేస్తామని చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.