అతను కనిపిస్తే టీవీ ఆఫ్ చేస్తా, నా పిల్లల్ని కూడా చూడనివ్వను: డింపుల్
తనకు అఖిలేష్ యాదవ్తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లి పెద్ద రాజ్యసభ సభ్యులు అమర్ సింగ్ పైన ఎంపీ డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు.
లక్నో: తనకు అఖిలేష్ యాదవ్తో దగ్గరుండి పెళ్లి చేయించిన పెళ్లి పెద్ద రాజ్యసభ సభ్యులు అమర్ సింగ్ పైన ఎంపీ డింపుల్ యాదవ్ నిప్పులు చెరిగారు. అలాంటి మనుషుల మాటలను పట్టించుకోనని, అతను టీవీలో వచ్చినప్పుడు కూడా తన పిల్లలు చూడకుండా ఆఫ్ చేస్తానని వ్యాఖ్యానించారు.
అమర్ సింగ్ లాంటి వ్యక్తుల మాటలను తాను పట్టించుకోనన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్ సింగ్ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఎప్పుడైనా అతడు టీవీలో కన్పిస్తే వెంటనే ఆఫ్ చేస్తానని, అతడిని తన పిల్లలు టీవీలో చూసేందుకు కూడా ఇష్టపడనని చెప్పారు.
అతడి వ్యాఖ్యలకు, ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. యూపీలో నిస్సందేహంగా ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని డింపుల్ చెప్పారు.
ఎన్నికలకు ముందు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన వివాదాల వల్ల పార్టీలో కొంతకాలం పాటు సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. తమ మధ్య విభేదాలకు అమర్ సింగ్ కారణమని అఖిలేశ్ భావించారు. తండ్రి ములాయం అమర్ సింగ్ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై అఖిలేశ్ అభ్యంతరం చెప్పడంతో వివాదానికి తెరలేచింది.