క్రెడిట్ కార్డ్ కూడా లేదు, నా డబ్బు వేరేవాళ్లు చెల్లిస్తారు: ముఖేష్ అంబానీ
న్యూఢిల్లీ: తాను తన వెంట ఎప్పుడు డబ్బులు లేదా క్రెడిట్ కార్డు తీసుకుపోనని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు.
ఆయన భారత ఆర్థిక వ్యవస్థ, ప్రగతి తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, తన దగ్గర క్రెడిట్ కార్డు కూడా లేదని చెప్పడం గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందన్నారు.
2030 నాటికి 10 ట్రిలియన్లకు చేరుకుంటుంది
2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై పది ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుందని ముఖేష్ అంబానీ తెలిపారు. 2004లో భారత ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. వచ్చే 20 ఏళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అప్పుడే తాను అంచనా వేశానని చెప్పారు.
కచ్చితంగా చేరగలం
ప్రస్తుత ప్రగతి చూస్తుంటే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుందని చెప్పారు. వచ్చే పదేళ్లలో 7 ట్రిలియన్ డాలర్లకు మనం చేరగలమా? అంటే కచ్చితంగా చేరగలమని, 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల సమీపానికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
డబ్బు గురించి నేను ఆలోచించలేదు
ఈ సందర్భంగా వ్యక్తిగత విషయాలను కూడా ముఖేశ్ అంబానీ పంచుకున్నారు. డబ్బు గురించి నేనెప్పుడూ ఆలోచించలేదన్నారు. తనకు సంబంధించిన వరకు వనరులే ముఖ్యమని అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా డబ్బు తీసుకెళ్లనని, తనకు క్రెడిట్ కార్డు కూడా లేదన్నారు.
మరొకరు నా డబ్బు చెల్లిస్తారు
మరొకరు తన డబ్బులు చెల్లిస్తారని, ఈ జెనరేషన్ చాలా విభిన్నంగా వినూత్నంగా ఆలోచిస్తోందని, తన పిల్లల నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన వ్యవస్థ మన ఆధార్ అన్నారు.