తీర్పుపై జయలలిత స్పందన, ముందస్తుకు వెళ్తారా?: ట్విట్టర్లో ఆగ్రహం
చెన్నై: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పు పైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా భావించడం లేదని చెప్పారు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు.
రాజకీయ కుట్రతోనే తన పైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలిచిందనే విషయం అందరు గుర్తించాలని ప్రకటించారు. కర్నాటక హైకోర్టు తీర్పు తమిళుల నమ్మకానికి దక్కిన విజయమని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
జయలలిత ముందస్తు వ్యూహం?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో.. తమిళనాడ రాజకీయం వేడెక్కింది. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై చర్చ సాగుతోంది. జయలలిత నిర్దోషిగా తేలడంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ముందస్తు నిర్ణయం జయలలితకే వదిలేశారు.
తీర్పుపై ట్విట్టర్లో విమర్శలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా తేల్చిన కోర్టు తీర్పుపై ట్విట్టర్లో విమర్శల వర్షం కురిసింది. ఆమెను నిర్దోషి అనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మమ్మీ రిటర్న్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధనికులు శిక్షల నుండి తప్పించుకోవచ్చని మరోసారి రుజువైందన్నారు.