మద్దతు ఎవరికి లేదు: రజనీ, క్యూలైన్లో ఖుష్బూ(ఫోటో)
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు రాజధాని చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు సూచన చేశారు. అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని రజనీకాంత్ ప్రజలకు, తన అభిమానులకు సూచించారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా అని విలేకరులు ప్రశ్నిస్తే... తాను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నానని, ప్రజలు కూడా అదే చేయాలని సూచించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు.
క్యూలో భర్తతో ఖుష్బూ
ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) నాయకురాలు, ఆ పార్టీ ప్రధాన ప్రచారకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె చెన్నైలో తన భర్త సుందరంతో కలిసి ఓటు వేశారు. ఓటు వేసేందుకు ఆమె క్యూ లైన్లో నిలబడ్డారు.
కాగా, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.