ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ కలకలం: తెలంగాణ ఆవిర్భావంపై కీలక వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆత్మకథ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం పుట్టిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాజకీయాలు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దానికి దారి తీసిన పరిస్థితుల గురించి తన ఆత్మకథలో రాసిన అంశాలు చర్చనీయాంశమౌతున్నాయి. ప్రత్యేకించి- 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హస్తం పార్టీ ఎలా పరాజయం పాలైందనే విషయాన్ని ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్: 2012-2017లో పొందుపరిచారు.
Recommended Video
నా చేతుల మీదుగా..
తన చేతుల మీదుగా రెండు తెలుగు రాష్ట్రాల విభజన ఉంటుందనే విషయాన్ని తాను ఏ మాత్రం ఊహించలేకపోయానని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. తెలంగాణ అపాయింటెడ్ డేకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్పై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన విషయం తెలిసిందే. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింటెడ్ డేగా ప్రణబ్ ముఖర్జీ గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తన చేతుల మీదుగా జరుగుతుందని ఏ మాత్రం భావించలేదని పేర్కొన్నారు.
చైనా అపర కుబేరుడు జాక్ మా ఎక్కడున్నాడో తేలింది: బందీగా: అజ్ఙాతంలోకి వెళ్లడానికి కారణం ఇదీ
మహారాష్ట్రపై ఏపీ విభజన ప్రభావం..
42 లోక్సభ స్థానాలతో దేశంలోనే రాజకీయంగా అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన ప్రభావం మహారాష్ట్రపై పడినట్లు తాను అంచనా వేసినట్లు ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిన తరువాత.. కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని భావించినప్పటికీ.. దానికి ప్రతికూల రాజకీయ వాతావరణం ఏర్పడిందని, పార్టీ పరిస్థితి క్షీణించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. అత్యంత బలమైన రాష్ట్రంగా ఉండేదని, అత్యధిక లోక్సభ స్థానాలను అందించిందని గుర్తు చేశారు. సోనియాగాంధీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మహారాష్ట్రలో పార్టీ బలహీనపడిందని స్పష్టం చేశారు.
హంగ్ వస్తుందని అంచనా..
2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఏర్పడుతుందని తాను అంచనా వేసినట్లు ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 195 నుంచి 200 స్థానాలతో భారతీయ జనతా పార్టీ.. ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని తాను అంచనా వేసినట్లు చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఓడిపోయిందని, దాని ప్రభావం ఫలితాలపై కనిపించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్కు బలమైన, సంప్రదాయబద్ధమైన ఓటుబ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఓటమి చెందడం వల్ల అధికారానికి దూరమైందని అన్నారు. 2014 నాటి ఎన్నికల్లో తాను స్థిరత్వానికి, అస్థిరత్వానికి మధ్యలో నిలిచానని పేర్కొన్నారు.
ప్రధాని అభ్యర్థిత్వంపై..
తాను 2004లో ప్రధానిగా బాధ్యతలను స్వీకరించి ఉంటే 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి నుంచి బయటపడేదని కొందరు సన్నిహితులు తన వద్ద వ్యాఖ్యానించారని, తాను వారితో ఏకీభవించలేదని అన్నారు. తనను రాష్ట్రపతి భవన్కు పంపించిన తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం దృష్ణి కోణంలో మార్పులు చోటు చేసుకున్నాయని, కీలక నిర్ణయాల్లో తడబాటు కనిపించిందని చెప్పారు. పార్టీని నడిపించడంలో సోనియా విఫలం కావడానికి అప్పటి పరిస్థితులు కూడా ఓ కారణం అయ్యాయని అన్నారు. యూపీఏ కూటమిని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి సోనియా-మన్మోహన్ సింగ్లకు ఏర్పడిందని చెప్పారు.