తీయని మాటలతో వంచన.. అమిత్ షా బృందాన్ని విశ్వసించం, శివసేన అభ్యర్థే సీఎం, ఉద్దవ్ థాక్రే
మరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియబోతోంది. కానీ బీజేపీ-శివసేన మధ్య పొత్తు పొడవలేదు. 50-50 ఫార్ములాకు బీజేపీ బెట్టుచేయడంతో శివసేన కూడా కొండెక్కి కూర్చొంది. దీంతో సీఎం పదవీకి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పుడు బంతి గవర్నర్ చేతిలోకి చేరింది.
బీజేపీతో పొత్తుపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తీవ్ర విమర్శలు చేశారు. పొత్తుపై ఆ పార్టీ నేతలు చెప్పిందొకటి.. చెస్తుంది మరొకటి అని మండిపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా, అతని అనుచరగణం తీయని మాటలతో బుట్టలో వేసుకుందామని ప్రయత్నించారని ఆరోపించారు. కానీ మేం వారి ట్రాక్లో పడలేదని చెప్పారు. అమిత్ షా చెప్పే ప్రతీ అంశం అబద్దమేనని విమర్శించారు. అందుకే వారి మాటలను నమ్మబోనని ఉద్దవ్ తేల్చిచెప్పారు.
తాను బీజేపీ నేతను కాదని, అబద్దం చెప్పనని ఉద్దవ్ స్పష్టంచేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చించారని.. 50-50 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని మరచిపోయారని విమర్శించారు. తాము శివసేనకు సీఎం పదవీ ఇస్తామని చెప్పలేదని మాట మార్చడం సరికాదన్నారు. ఆ రోజు అలా చెప్పి ఇప్పుడు అధికారం కోసం మాట మార్చడం సరికాదన్నారు. నిజాన్నీ సమాధి చేయలేరని.. సత్యం ఎప్పుడో ఒకసారి బయటపడుతుందన్నారు.
మహారాష్ట్రలో శివసేన అభ్యర్థి సీఎం అవుతారని ఉద్దవ్ తేల్చిచెప్పారు. శివసేన నుంచి సీఎం కావడానికి అమిత్ షా, పఢ్నవీస్ ఆమోదం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజల మద్దతు, పార్టీకి సంఖ్యాబలం ఉంటే చాలన్నారు. శివసేన అభ్యర్థి సీఎం పదవీ చేపట్టాలని బాల్ థాక్రే కోరుకునేవారని గుర్తుచేశారు. ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని ఉద్దవ్ చెప్పారు.