నేను బీఫ్ తింటా.. దేశంలోనే ఉంటా: నఖ్వీకి కిరణ్ రిజిజు కౌంటర్
న్యూఢిల్లీ: బీఫ్ తినకపోతే బ్రతకలేనివారు దేశం వదిలిపెట్టి పాకిస్థాన్ వెళ్లాలన్న కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తాను బీఫ్ తింటానని, తనను ఎవరైనా ఆపగలరా? అని ఆయన ప్రశ్నించారు.
తన సహచరుడి వ్యాఖ్యలు 'రుచి, పచి లేని'వని కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. 'నేను బీఫ్ తింటాను. అరుణాచల్ప్రదేశ్లోనే ఉంటా. నాతో ఎవరైనా బీఫ్ తినడం మాన్పించగలరా? అని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. భారత్ దేశంలో అందరి మనోభావాలు గుర్తించాలని, వారి వారి పద్ధతులు, సంప్రదాయాలను సమానంగా గౌరవించాల్సి ఉందని ఆయన అన్నారు.
ఒకవేళ బీఫ్ తినకుండా నిషేధించాలనుకుంటే.. మహారాష్ట్రలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉన్నందున హిందు మతవిశ్వాసం ప్రకారం అక్కడని చట్టాన్ని అమలు చేసుకోండని కిరణ్ రిజిజు సూచించారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక శాతం ప్రజలు బీఫ్ తింటారని, దానివల్ల తమకు ఎలాంటి సమస్య లేదన్నారు.
ప్రతి పౌరుడి మనోభావాలను గుర్తించాలని కిరణ్ రిజిజు అన్నారు. బీఫ్ తినాలనుకుంటే పాక్,లేదా అరబ్ దేశాలు వెళ్లాలని నక్వీ వ్యాఖ్యలు చేయటం మంచి పరిణామం కాదన్నారు. అయితే ఆయనకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని తెలిపారు.