నేనే సిగ్గుపడుతున్నాను: జలియన్వాలా బాగ్ ఘటనపై బ్రిటన్ ఆర్చ్ బిషప్
అమృత్సర్: బ్రిటన్లోని కాంటర్బరీ ఆర్క్బిషప్ జస్టిన్ వెల్బీ భారత్లోని జలియన్వాలా బాగ్ స్మారక స్థూపంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు ఇంతమందిని పొట్టనబెట్టుకున్న బ్రిటీషు వారిని చూసి సిగ్గుపడుతున్నానని చెప్పారు. అంతేకాదు ఆ స్థూపం ఎదుట మృతి చెందిన వారికి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి నివాళులు అర్పించారు. అంతేకాదు అక్కడికి చేరి వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రార్థిచిన ఆయన నాడు ఈ ఘటనకు పాల్పడిన వారిని దేవుడు క్షమించాల్సిందిగా ప్రార్థనలు చేశారు.
స్మారక చిహ్నం ఎదుట సాష్టాంగ నమస్కారం చేసిన ఆర్చ్ బిషప్
"నాటి బ్రిటీషు పాలకులు పాల్పడిన ఈ ఘాతుకంకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా ఈ స్థూపం రూపంలో బతికేఉన్నాయి. ఈ నేరంకు పాల్పడిన బ్రిటీషు వారి తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. నిజంగా ఈ ఘటనపై సిగ్గు పడుతున్నాను, ఒక మతాధిపతిగా ఈ ఘటనను ఖండిస్తున్నాను" అని ఆర్చ్ బిషప్ జస్టిన్ వెల్బీ చెప్పారు. అంతే కాదు జలియన్వాలాబాగ్ను సందర్శించిన ఫోటోలను పెడుతూ ఆయన ట్వీట్ కూడా చేశారు. తాను అమృతసర్లో నాడు జరిగిన ఘోరకలికి సాక్ష్యంగా నిలిచిన స్థూపాన్ని సందర్శించడం జరిగిందని ఈ ఘటనపై సిగ్గుపడుతున్నట్లు తన ట్వీట్లో పేర్కొన్నారు ఆర్క్ బిషప్. ఇక్కడ సిక్కులు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింలను 1919లో బ్రిటీష్ బలగాలు ఊచకోత కోశాయని ఆయన ట్వీట్ చేశారు.
జలియన్వాలా బాగ్ ఘటనపై అధికారికంగా స్పందించని యూకే
యూకే తరపున క్షమించాల్సిందిగా కోరేంత అర్హత తనకు లేదని అయితే వ్యక్తిగతంతా తాను క్షమించాల్సిందిగా కోరానని తన ఫేస్బుక్పోస్టులో రాసుకొచ్చారు. ఇప్పటి వరకు జలియన్వాలాబాగ్ ఊచకోతకు సంబంధించి బ్రిటన్ ఎప్పుడూ అధికారికంగా తన తప్పును క్షమించాల్సిందిగా కోరలేదు. జలియన్వాలా బాగ్ ఘటన జరిగి 100ఏళ్లు పూర్తయిన సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాని థెరిసా మే మాత్రం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే భారతీయులపై కాల్పులు
ఏప్రిల్ 1919లో బైసాకి పండగను నిర్వహించుకుంటున్న సమయంలో జలియన్వాలా బాగ్ ఊచకోత ఘటన జరిగింది. జనరల్ డైయర్ నేతృత్వంలో బ్రిటీషు బలగాలు తుపాకులతో అక్కడికి చేరివచ్చిన భారతీయులను కాల్చాయి.ఆ సమయంలో శాంతియుతంగా వారు తమ నిరసనలు తెలిపారు. బ్రిటీష్ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ ఘటనలో 379 మంది చనిపోయారు. ఇందులో పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 1200 మందికి గాయాలయ్యాయి. అయితే భారత అధికార లెక్కల ప్రకారం దాదాపు 1000 మంది చనిపోయారు.
ఇదిలా ఉంటే 10 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆర్చ్ బిషప్ ముందుగా కోల్కతా, మెదక్, జబల్పూర్, బెంగళూరు నగరాలను సందర్శించారు. అనంతరం అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్ను సందర్శించారు.