ప్రధాని అయ్యే అవకాశాలు వదులుకున్నా: ఏపీ సీఎం చంద్రబాబు
"రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది.. కానీ నేనే వదిలేసుకున్నా.." అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
చెన్నై: "రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది.. కానీ నేనే వదిలేసుకున్నా.." అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చెన్నైలో 'ఇండియాటుడే' నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇండియా టుడే సంపాదకులు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. అమరావతిని ప్రపంచ శ్రేణి ఉత్తమ నగరాల్లో ఒకటిగా నిర్మించాలన్నదే తన ఆశయమని చెప్పారు.
రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. యునైటెడ్ ఫ్రంట్ హయాంలో రెండుసార్లు తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, కానీ తన ప్రాధాన్యత రాష్ట్ర రాజకీయాలకే అని ఆ అవకాశాన్ని తిరస్కరించానని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికీ తన అభిప్రాయంలో మార్పు లేదన్నారు.
గత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను సహేతుకంగా విభజించని కారణంగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న వైకాపా వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అవినీతి కేసులో జైలు జీవితం గడిపిన వారి వ్యాఖ్యలు పట్టించుకోవలసిన అవసరం లేదంటూ చంద్రబాబు కొట్టిపారేశారు.
అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు..
అంతకుముందు చెన్నై విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ ఏడాది తొలి సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని ఆయన తెలిపారు. ఇకపై రాష్ట్ర శాసనసభ సమావేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతాయన్నారు. మరో 20 రోజుల్లో అమరావతి అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు.
తమిళనాడుకు కృష్ణా జలాల విడుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాసిన లేఖను ప్రస్తావించగా.. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందని, అయినప్పటికీ పరిస్థితిని బేరీజు వేసుకుని చెన్నైకి నీరందించే అవకాశాలను పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారు.