దేశీయ బ్రీడ్ జాగిలాలను పెంచుకోండి: ప్రధాని: దేశ రక్షణలో: ఆర్మీలోనూ వాటికి ప్రాధాన్యత
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థలో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో జాగిలాలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదని చెప్పారు. భద్రత వ్యవస్థలోనే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ జాగిలాలు బాధితుల ప్రాణాలను నిలపడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో వివిధ విదేశీ జాతికి చెందిన వాటితో పాటు దేశీయ బ్రీడ్ జాగిలాలు అందిస్తోన్న సేవలను ఏ మాత్రం విస్మరించలేమని చెప్పారు. ఇండియన్ బ్రీడ్ శునకాలను పెంచుకోవాలని ఆయన సూచించారు.
మన్ కీ బాత్లో అనేక అంశాలు..
ప్రధాని తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మన్ కీ బాత్ సిరీస్లో ఇది 68వ ఎపిసోడ్. ఈ సందర్భంగా మోడీ.. పలు కీలక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. జాతీయ నూతన విద్యావిధానం గురించి మాట్లాడారు. పిల్లల్లో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి బొమ్మల తయారీ అంశాన్ని ఇందులో చేర్చినట్లు చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లి, విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక బొమ్మల గురంచీ ప్రస్తావించారు.
దేశ రక్షణలో జాగిలాలు కీలకంగా..
అనంతరం దేశ రక్షణలో జాగిలాల పాత్ర గురించి మోడీ ఈ సారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్మీకి చెందిన విదా, సోఫీ జాగిలాల గురించి మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రెండు జాగిలాలను ఆర్మీ అధికారులు కమెండేషన్ కార్డ్స్తో సత్కరించారని చెప్పారు. దాని గురించి కూలంకషంగా వివరించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డులతో వాటిని సత్కరించడానికి కారణం.. దేశీయ రక్షణలో అవి కీలకంగా మారడమేనని అన్నారు. అలాంటి జాగిలాలు ఇండియన్ ఆర్మీలోనే అనేకం ఉన్నాయని చెప్పారు. దేశ రక్షణలో బలిదానాలను ఇస్తున్నాయని చెప్పారు.
ఉగ్రవాద దాడుల నుంచి..
అనేక బాంబు పేలుళ్లు, ఉగ్రవాద దాడులను ఆ జాగిలాలు ముందుగానే పసికడుతున్నాయని, ఉపద్రవాలను నివారిస్తున్నాయని అన్నారు. ఈ పరంపరలో ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదని చెప్పారు. 2006లో బలరాం అనే జాగిలం అమర్నాథ్ యాత్ర మార్గంలో ఉగ్రవాదులు పాతిపెట్టిన మందుగుండు సామాగ్రిని వెలికి తీసిందని అన్నారు. 2002లో భావన అనే మరో జాగిలం ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని గుర్తించిందని, దాన్ని వెలికి తీసే ప్రయత్నంలో వీరమరణం పొందిందని ప్రధాని చెప్పారు. ఛత్తీస్గఢ్లో సీఆర్పీఎఫ్కు చెందిన క్రాకర్ అనే జాగిలం.. మందుపాతర పేలడంతో వీరమరణం పొందిందని అన్నారు.
రెస్క్యూ ఆపరేషన్లలో..
మహారాష్ట్ర బీడ్ పోలీసులకు చెందిన రాకీ.. 300లకు పైగా కేసులను ఛేదించడానికి సహాయపడిందని మోడీ చెప్పారు. కొద్దిరోజుల కిందటే ఆ జాగిలం మరణించగా.. పోలీసులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారని అన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ ఆపరేషన్లు, భవనాల శిథిలాల నుంచి క్షతగాత్రులను వెలికి తీయడంలో జాగిలాలు ఎనలేని కృషి చేస్తున్నాయని మోడీ ప్రశంసించారు. ఎన్డీఆర్ఎఫ్ ఇలాంటి డజన్ల కొద్దీ జాగిలాలకు శిక్షణ ఇచ్చిందని అన్నారు.
Recommended Video
వాటిని పెంచుకోండి..
భారతీయ బ్రీడ్కు చెందిన అనేక జాగిలాలు దేశ రక్షణ, రెస్క్యూ ఆపరేషన్లలో కీలకంగా మారాయని చెప్పారు. ముధోల్ హౌండ్, హిమాచలీ హౌండ్, రాజపాలయం, కన్నీ, చిప్పిపరై, కొంబాయ్ వంటి దేశీయ జాగిలాల సేవలను వినియోగించకుంటున్నాయని అన్నారు. వాటి నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుందని, దేశీయ వాతావరణానికి సులువుగా అలవాటు పడతాయని మోడీ చెప్పారు. ఆర్మీ, సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ.. ముధోల్ హౌండ్ జాతికి చెందిన దేశీయ జాగిలాలకు విస్తృతంగా శిక్షణ ఇస్తున్నాయని మోడీ తెలిపారు. దేశ ప్రజలు కూడా అలాంటి జాతికి చెందిన శునకాలను పెంచుకోవాలని మోడీ సూచించారు.