నన్ను నేను వెతుక్కోడానికి వచ్చా: హింస ప్రభావిత ప్రాంతాలకు ఢిల్లీ గవర్నర్..కేంద్రం ఏమందంటే..
దేశరాజధాని ఢిల్లీలో మతఘర్షణల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండు మతాలకు చెందిన వేల మంది పేదలు బతుకుదెరువు కోల్పోయారు. వందలాది దుకాణాలు, ఇల్లు దగ్ధమైపోవడంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. శుక్రవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 42కు పెరిగింది. ఇంకా వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హింస పూర్తిగా ఆగిపోయినప్పటికీ జనజీవనం ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఈశాన్య ఢిల్లీలో పర్యటించారు.
అనూహ్య వ్యాఖ్యలు
ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో జాఫ్రాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, భజన్ పూర్ ఏరియాలో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఉన్నతాధికారులు, కేంద్ర బలగాలు వెంటరాగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శుక్రవారం సాయంత్రం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. వీధుల్లో సామాన్య ప్రజలతో మాట్లాడుతూ ధైర్యం కలిగించారు. ‘‘నన్ను నేను వెతుక్కోడానికే ఇక్కడికి వచ్చాను''అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కాగా, హింసకు దారితీసిన పరిస్థితులు, దాని వెనకున్న కారణాలు, అల్లర్ల నియంత్రణలో యంత్రాంగం వైఫల్యాలపై విలేకరుల ప్రశ్నలకు ఆయన బదులు చెప్పలేదు.
వదంతులు నమ్మొద్దన్న కేంద్రం
అల్లర్లు తగ్గుముఖం పట్టిన తర్వాత ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతున్నదని, ఇంకా ఏదో జరిగిపోతోందంటూ ప్రచారమవుతోన్నవదంతులను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఢిల్లీ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, గురు, శుక్రవారాల్లో హింసాత్మక ఘటనలేవీ జరగలేదని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Recommended Video
బీజేపీ చీఫ్ మౌనం..
ఢిల్లీ అల్లర్లకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. రాజధర్మం గురించి కాంగ్రెస్ చేత నీతులు చెప్పించుకునే స్థితికి బీజేపీ దిగజారలేదని, హింసను ప్రోత్సహించడంలో సోనియా, రాహుల్, ప్రియాంక, కేజ్రీవాల్ పాత్ర చాలా ఉందని ఆయన ఆరోపించారు. కాగా, ఢిల్లీ అల్లర్లపై స్పందించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిరాకరించారు. శుక్రవారం హిమాచల్ మాజీ సీఎం, కాంగ్రెస్ వెటరన్ వీరభద్ర సింగ్ తో భేటీ అయిన సందర్భంలో నడ్డాను మీడియా ప్రశ్నించగా, ఆయన సమాధానం ఇవ్వకుండా వడివడిగా వెళ్లిపోయారు.