రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ: మోడీకి వినతి
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగవంత్ సింగ్ కోశ్యారీ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తాను గవర్నర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ ద్వారా తెలియజేసినట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఛత్రపతి శివాజీపై కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజ్ భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. గవర్నర్ కోష్యారీ (80) తన శేష జీవితాన్ని చదవడం, రాయడం, ఇతర విరామ కార్యక్రమాలలో గడపాలని ఆకాంక్షించారు.
"మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య సేవక్ లేదా రాజ్యపాల్గా పనిచేయడం నాకు ఒక సంపూర్ణ గౌరవం. ఇది సాధువులు, సంఘ సంస్కర్తలు, వీర యోధుల భూమి' అని కోశ్యారీ పేర్కొన్నారు.
ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన సందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరినట్లు కోష్యారీ తెలిపారు.
I have always received the love and affection from the Hon’ble Prime Minister and I hope to receive the same in this regard.
— Governor of Maharashtra (@maha_governor) January 23, 2023
"గత మూడేళ్లలో మహారాష్ట్ర ప్రజల నుంచి నాకు లభించిన ప్రేమ, ఆప్యాయతలను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇటీవల ప్రధానమంత్రి ముంబై పర్యటన సందర్భంగా.. అన్ని రాజకీయ బాధ్యతలను వదులుకోవాలనే నా కోరికను నేను ఆయనకు తెలియజేశాను. నా శేష జీవితాన్ని చదవడం, రాయడం, ఇతర కార్యకలాపాలలో గడపాలని ఆకాంక్షిస్తున్నా. నేను ఎల్లప్పుడూ ప్రధానమంత్రి నుంచి ప్రేమ, ఆప్యాయతలను పొందుతాను. ఈ విషయంలో కూడా అదే విధంగా అందుకోవాలని ఆశిస్తున్నాను' అని గవర్నర్ కోశ్యారీ తన ప్రకటనలో వెల్లడించారు.