మోడీజీ నేనూ అదే అడుగుతున్నా..: 2013 ట్వీట్ వెలికితీసిన చిదంబరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా, గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్ను ప్రస్తావిస్తూ ధ్వజమెత్తారు.
ఇప్పడు తాను కూడా అదే అడుగున్నానని చిదంబరం చెప్పుకొచ్చారు. 2013లో యూపీఏ-2 ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిదంబరం ఆర్థికమంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో చిదంబరాన్ని ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతోంది. యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు. చిదంబరం జీ.. రాజకీయాలు మాని ఆర్థిక వ్యవస్థ గురించి సమయం కేటాయించండి. ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి సారించండి' అని ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్కు సంబంధించిన స్క్రీన్షాట్ను చిదంబరం ట్వీట్ చేస్తూ తాను ఇప్పుడు అదే అడుగుతున్నా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జీడీపీ పతనం, నిరుద్యోగం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు.
పీఎం కేర్స్ ఫండ్ పైనా చిదంబరం ప్రశ్నలు
దేశంలో కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు మొదటి ఐదు రోజుల్లోనే రూ. 3076 కోట్లు భారత్ తోపాటు విదేశాల నుంచి విరాళాలుగా వచ్చాయని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. మార్చి 27-31 తేదీల మధ్య కాలంలో ఈ మొత్తం వచ్చినట్లు నమోదైంది. అయితే, ఈ నిధిని ప్రాథమికంగా 2.25 లక్షల కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది.
పీఎం కేర్స్ ఫండ్లోకి వచ్చిన మొత్తంలో 3,075.85 కోట్లు దేశీయంగా విరాళాులగా రాగా, విదేశాల నుంచి 39.67 లక్షలు వచ్చాయని వెల్లడించింది. 35 లక్షల వడ్డీ కూడా వచ్చిందని తెలిపింది. ఫోరెక్స్ కన్వర్షన్ పై సర్వీసు టాక్స్ రూపంలో 2049 రూపాయలు చెల్లించినట్లు పేర్కొంది. మార్చి 31 నాటకి క్లోజింగ్ 3076.62 కోట్లు ఉన్నాయని తెలిపింది. అయితే, విరాళాలు అందించినవారి పేర్లు మాత్రం వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం విరాళాలు అందించినవారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఏ ఎన్జీవో అయినా లేదా ట్రస్ట్ అయినా కూడా తమకు విరాళాలు ఇచ్చినవారి పేర్లను వెల్లడిస్తాయి. మరీ పీఎం కేర్స్ ఫండ్ ఎందుకు పేర్లను వెల్లడించదని ఆయన నిలదీశారు. డోనర్లు ఎవరో తెలిసినప్పుడు పేర్లను వెల్లడించడానికి ఎందుకంత భయపడుతున్నారు? అని చిదంబరం ప్రశ్నించాడు.
కాగా, పీఎం కేర్స్ ఫండ్ ప్రజల నుంచి నిధులు సేకరించడం లేదని.. ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తోందని అందుకే ఈ నిధిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేయలేదని పీఎంఓ స్పష్టం చేసింది. కరోనాతో పోరాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చట్టబద్ధమైన నిధి ఉనికిలో ఉండటం, స్వచ్ఛంద విరాళాల కోసం వేరొకదాన్ని ఏర్పాటు చేయడాన్ని నిషేధించదని పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును జూలై 11 న కేంద్రం సమర్థించింది. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రభుత్వ శాఖలు సుమారు రూ. 2వేల కోట్లు పీఎం కేర్స్కు విరాళంగా ఇచ్చినట్లు జాతీయా మీడియా వార్తలను ప్రచురితం చేసిన విషయం తెలిసిందే.
I have to say the same thing to the Honourable Prime Minister! pic.twitter.com/reNmp84mRu
— P. Chidambaram (@PChidambaram_IN) September 2, 2020
పీఎం కేర్స్ ఫండ్కు ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉండగా, రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. కాగా, మే 13న పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ. 3100 కోట్లను ప్రభుత్వ ఆస్పత్రుల్లో 50వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్ల కోసం, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కేటాయించింది. బీహార్ రాస్ట్రంలో రెండు 500 బెడ్లతో ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా డబ్బును కేటాయించింది.