నా కూతురును చూడాలి: ఉరికి ముందు యాకుబ్
నాగ్పూర్: ‘నా కూతురును ఒకసారి కలవాలి' ఇది 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మెమన్ చివరి కోరికలలో ఒకటి. అంతేగాక, తన ఉరిశిక్ష రాజకీయం చేయబడిందని యాకుబ్ చెప్పినట్లు తెలిసింది.
‘మిడ్ డే' కథనం ప్రకారం.. ‘నాకు తెలుసు నేను మరణించబోతున్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కానీ, నేను బతకలేను' అని బుధవారం ఉదయం యాకుబ్ ఓ హోంగార్డుతో చెప్పాడు. యాకుబ్ బుధవారం చాలా ఆందోళనగా ఉన్నాడని, సుప్రీంకోర్టులో ఏం జరుగుతోందని పదే పదే తనను అడిగాడని ఆ హోంగార్డు తెలిపారు. కాగా, మెమన్ చివరి కోరికలను జైలు అధికారులు తీర్చినట్లు తెలిసింది. మెమన్ తన కూతురు, కుటుంబసభ్యులతో ఉరికి కొన్ని గంటలముందు మాట్లాడినట్లు సమాచారం.
బుధవారం ఉదయం పూట అల్పాహారం తీసుకున్న యాకుబ్ మెమన్.. మధ్యాహ్నం భోజనం మాత్రం చేయలేదని ఆ కానిస్టేబుల్ చెప్పారు. కాగా, బుధవారం యాకుబ్ మెమన్కు సుప్రీం కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. వందలమంది ప్రజల మరణానికి కారణమైన యాకుబ్, క్షమాభిక్షకు అర్హుడు కాడని కోర్టు స్పష్టం చేసింది.
ఉరిశిక్ష సమయంలో అక్కడే కుటుంబసభ్యులు?
ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ను ఉరి తీసే సమయంలో ఆయన సోదురుడు సులేమాన్, తదితరులు నాగపూర్ జైళ్లోనే ఉన్నట్లు సమాచారం. అయితే మెమన్ భార్య రహిన్ మాత్రం బుధవారం రాత్రి ముంబై చేరుకున్నారు. అనంతరం గురువారం ఉదయమే ముంబై నుంచి నాగపూర్ బయల్దేరి వెళ్లినట్టు తెలుస్తోంది.
మెమన్ భౌతిక కాయాన్ని తమకు అప్పగించాల్సిందిగా ఆమె జైలు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం ఉదయం 6.30 నుంచి 6.50 గంటల మధ్యలో యాకుబ్కు ఉరిశిక్ష అమలైంది. అనంతరం మెమన్ మరణించినట్టు వైద్యుడు ధృవీకరించారు. తెల్లవారుజామున ఒంటిగంటకు నిద్రలేచిన మెమన్ స్నానం చేసి కాసేపు ప్రార్థనలు కూడా చేసినట్టు సమాచారం.