నీ గొంతు కోస్తా: అధికారి నిర్లక్ష్యంపై జిల్లా మేజిస్ట్రేట్ తీవ్ర హెచ్చరిక
లక్నో: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే కింది స్థాయి ఉద్యోగులను ప్రభుత్వ ఉన్నతాధికారులు మందలించడం సాధారణే విషయమే. అయితే, దానికి ఓ పద్ధతంటూ ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ ఉన్నతాధికారి కింది స్థాయి ఉద్యోగికి చేసిన హెచ్చరికలు కలకలం రేపాయి. ప్రస్తుతం సదరు ఉన్నతాధికారి చేసిన హెచ్చరికల వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెహత్లోని పంచాయతీ కార్యాలయానికి సహరాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్(డీఎం) పీకే పాండే తనిఖీలకు వెళ్లారు. పంచాయతీ రికార్డుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు గుర్తించిన ఆయన.. అధికారులపై మండిపడ్డారు. బాధ్యుడైన ఓ అధికారిపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే అధికారం మీకున్నా మీ ప్రాంతాల్లో పర్యటించరు. మీ పద్ధతి మార్చుకోకుంటే మీ గొంతు కోస్తా' అని డీఎం పాండే తీవ్రంగా హెచ్చరించారు. కాగా హెచ్చరికల వీడియో వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో పాండేను వివరణ కోరగా.. తన మాటలను వక్రీకరించారని, తాను ఆ విధంగా అనలేదని ఆయన చెప్పుకొచ్చారు. వీడియోలో చూపిస్తున్నట్లుగా తన ఉద్దేశం అది కాదని, తన మాటలు అపార్థం చేసుకున్నారని చెప్పారు. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన తెలిపారు.
రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. అధికారుల అలసత్వం వల్ల ఎవరైనా కార్మికులకు ప్రమాదం జరిగితే అధికారులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని తాను హెచ్చరించానని పాండే స్పష్టం చేశారు.