మీడియా సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తోంది: వెంకయ్య కంటతడి
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానంటూ కంటతడిపెట్టారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో తన చిన్నతనాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానంటూ కంటతడిపెట్టారు.
భారత 15వ ఉపరాష్ట్రతిగా వెంకయ్య నాయుడు శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాజ్యసభలో చైర్మన్గా అడుగు పెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. దేశం కోసం పోరాడిన మహానుభావుల సేవలను గుర్తుంచుకోవాలన్నారు. సభ్యులు సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను అన్ని పార్టీలకు చెందిన వాడినన్నారు.
దటీజ్ వెంకయ్యనాయుడు, అలా ఎవరికీ సాధ్యం కాదు: మోడీ ప్రశంసలు
తాను రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో చర్చ సజావుగా సాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. మీడియా సంచలనాలు, వివాదాలకే ప్రాధాన్యం ఇస్తోందని, వాస్తవాలపై ఫోకస్ చేయాలని సూచించారు.
మనమంతా శత్రువులం కాదని, రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మాటలను తాను మనసారా చెబుతున్నానన్నారు. ఎంపీలంతా చర్చలు జరిపి ఉత్తమమైన ఫలితాలు సాధించాలన్నారు.
చట్టసభలను నంబర్ గేమ్గా మార్చకూడదన్నారు. ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే గడిచిందన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలోనడిపించేందుకు మనమంతా కలిసి పని చేద్దామన్నారు. ఉత్తమ భారతదేశమే అన్ని పార్టీల లక్ష్యం కావాలన్నారు.
దేశ వ్యవహారాల పట్ల యువత ఆసక్తి చూపుతున్నారన్నారు. మన దేశం ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశమని తెలిపారు. ఆయన రాజ్యసభలో చైర్మన్ హోదాలో తొలిసారి మాట్లాడారు.