నేను హిందువునే కానీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమత సంచలనం
జన్మతా: తాను హిందువునేనని, అయితే హిందువులను అపఖ్యాతి పాలు చేసే బీజేపీ తరహా హిందూత్వను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
భువనేశ్వర్: జన్మతా: తాను హిందువునేనని, అయితే హిందువులను అపఖ్యాతి పాలు చేసే బీజేపీ తరహా హిందూత్వను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.
ఒడిశాలోని ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని ఆమె బుదవారం నాడు దర్శించుకొన్నారు. బెంగాలీలకు పూరి జగన్నాథుడంటే అమితమైన నమ్మకమన్నారు. ఏటా పూరికి వచ్చే భక్తుల్లో బెంగాలీలు పెద్ద సంఖ్యలో ఉంటారని ఆమె గుర్తు చేశారు.
తనకు ఆలయ ప్రవేశంపై బీజేపీ , ఆ పార్టీ అనుబంధ సంఘాలు రచ్చ చేయడంపై మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పూరి ఆలయంలో పూజల అనంతరం సర్క్యూట్ హౌస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.
బీజేపి కార్యకర్తలు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నాకు మాత్రం జగన్నాథుడి పట్ల విశ్వాసం ఉందన్నారు. హిందూ మతం చాలా గొప్పదన్నారు. అందరినీ కలుపుకొనేతత్వం హిందూ మతంలో ఉందన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద, హిందూ మత ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్ళారని గుర్తు చేశారు.
పూరి ఆలయంలో జగన్నాధుడి దర్శనం కోసం వచ్చిన మమతకు వ్యతిరేకంగా బీజేపి యువమోర్చా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. గతంలో హిందువులు కూడ గొడ్డుమాసం తినొచ్చు అని మమత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. గోమాంస భక్షణను సమర్థించిన మమతను ఆలయంలోకి అడుగుపెట్టనియబోమని పూరి సహా పలు ప్రాంతాల్లో బీజేపి కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.అయితే పోలీసులు వారిని అరెస్టు చేశారు. దేశంలో ప్రాంతీయపార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ చెప్పారు. ఆయా పార్టీలు ప్రాంతీయంగా బలంగా ఉంటూనే జాతీయ స్థాయిలో కలిసికట్టుగా ఉండాలన్నారామె.