చీకటిలో అంతర్మాతతో పోరాడుతున్న : మోదీ చాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ హెలికాప్టర్ తనిఖీ చేయడం కూడా తన విధుల్లో భాగమని మరోసారి స్పష్టంచేశారు కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మహమ్మద్ మోసిన్. మోదీ భద్రతా సిబ్బంది ఎస్పీజీ అనుమతి తీసుకోకుండా తనిఖీ చేశారని ఈసీ ఆయనను విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీనిని ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ఊరట కలిగింది. మహమ్మద్ సస్పెన్షన్ ను ఎత్తివేసిన ఈసీ .. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పింది.
పనిచేసినందుకు గిఫ్ట్
ఎన్నికల సంఘం తాజా ఆదేశాలపై ధీటుగానే స్పందించారు మహమ్మద్ మోసిన్. 'నేను నా విధులు నిర్వర్తించాను, పనిచేసినందుకు పని నుంచి తప్పించారు. కానీ ఇంతవరకు నేను చేసిన తప్పకు సంబంధించి పేజీ నివేదిక కూడా ఇవ్వలేదు. దీంతో నేను చీకటిలో నాతోనే పోరాడుతున్నా‘ అని స్పష్టంచేశారు మోసిన్.
విధులు నిర్వహించడం తప్పా ?
వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేసేందుకు మోదీ హెలికాప్టర్ తనిఖీ చేశానని స్పష్టంచేశారు. దీంతో మోదీ ప్రయాణానికి 15 నిమిషాల ఆలస్యమైంది. హెలికాప్టర్ ఫుటేజీ తీయమనడం తప్పా ? అని మహ్మద్ ప్రశ్నించారు. నిజాయితీగా డ్యూటీ చేస్తే విధుల నుంచి తప్పిస్తారా అని నిలదీశారు. నీతిగా డ్యూటీ చేసిన తాను తప్పుచేయలేదని .. అందుకే ట్రిబ్యునల్ ను ఆశ్రయించానని స్పష్టంచేశారు. తన 22 ఏళ్ల సర్వీసులో నీతి, నిజాయితీగా పనిచేశానని చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టంచేశారు. నియమ, నిబంధనలను అనుసరించి పనిచేస్తానని తేల్చిచెప్పారు.
అందరూ సమానమే కదా ?
ప్రధాని భద్రతా సిబ్బంది ఎస్పీజీ అనుమతి తీసుకోకుండా మహ్మద్ తనిఖీ చేశారని ఈసీ చెప్తుండగా .. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి అందరినీ తనిఖీ చేయాల్సిందేనని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఇందుకు ఎవరూ అతీతులు కారని .. ఎస్పీజీ అనుమతి తీసుకోనవసరం లేదని స్పష్టంచేసింది. హెలికాప్టర్ లో వీడియో తీస్తే ఎస్పీజీ అభ్యంతరం ఏంటని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అలా అయితే కర్ణాటక సీఎం కుమారస్వామి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ ఎందుకు తనికీ చేశారని కొశ్చన్ చేసింది.