అమెరికా భారత్ల మధ్య బంధం బలోపేతం అవ్వాలి: నిక్కీ హేలీ
ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ భారత పర్యటనకు వచ్చారు. అమెరికా భారత్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేదానిపైనే తాను దృష్టిసారించనున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు ఆమె భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేదిశగా పావులు కదపనున్నారు.
భారత్ అమెరికాల మధ్య చాలా అంశాల్లో సారూప్యత కలిగి ఉన్నాయని చెప్పిన హేలీ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేస్తామని తెలిపారు. భారత్తో అమెరికాకు ముందునుంచే మంచి స్నేహం ఉందని, ఈ బంధాన్ని మరింత దృఢంగా మార్చేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని హేలీ వ్యాఖ్యానించారు. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ట్రంప్ పాలనావర్గంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు.
తన పర్యటనలో భారత్లోని ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆమె భేటీ అయి పలు అంశాలపై చర్చిస్తారు. ఆరేగాన్, న్యూమెక్సికోలోకి అక్రమంగా వచ్చారంటూ పలువురి భారతీయులను అమెరికా అరెస్టు చేసిన నేపథ్యంలో నిక్కీ హేలీ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్లో నిక్కీ హేలీ పర్యటన ముగిసిన తర్వాత ఇరుదేశాల మధ్య జూలై 6న విదేశీ వ్యవహారాలు, రక్షణ రంగంలో చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో భారత్ నుంచి సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్లు హాజరుకానుండగా... అమెరికా నుంచి మైఖేల్ పాంపో, డిఫెన్స్ సెక్రటరీ జేమ్స్ మాటిస్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ రంగం, భద్రతా సహకారం మధ్య చర్చలు జరగనున్నాయి.