మమత కోటను కూల్చేందుకే వచ్చాను: అమిత్ షా
కోల్కతా: మమతా బెనర్జీ కోటను కూల్చేందుకే ఇక్కడి తాను వచ్చినట్లు చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సెంట్రల్ కోల్కతాలోని మాయో రోడ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమిత్ షా చెప్పిన మాటలకు సభకు హాజరైన బీజేపీ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. కొద్ది రోజుల క్రితం అస్సాంలో జరిగిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ జాబితాలో 40 లక్షల మంది పౌరుల పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ పై ఎదురుదాడికి దిగారు అమిత్ షా. వారంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులని వారంతా మమతా ఓట్ బ్యాంక్ అని షా ధ్వజమెత్తారు.
" ఎన్ఆర్సీని వ్యతిరేకించడమే పనిగా మమతా బెనర్జీ పెట్టుకున్నారు. అసలు దాని వెనక ఉన్న ఉద్దేశం ఆమె గ్రహించడంలేదు. ఎన్ఆర్సీ ముఖ్య ఉద్దేశం మన పౌరులు కాకుండా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను తిరిగి పంపడమే " అని అమిత్ షా అన్నారు. బీజేపీని కేంద్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకిస్తారో వ్యతిరేకించండని చెబుతూనే ఎన్ఆర్సీ ప్రక్రియ మాత్రం ఆపమని అమిత్ షా స్పష్టం చేశారు. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమవలసదారులను ఎందుకు రక్షణ కల్పిస్తుందో సూటిగా అడుగుతున్నట్లు అమిత్ షా అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ఎన్ఆర్సీపై తన వైఖరిని స్పష్టం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇదంతా ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అని అమిత్ షా మండిపడ్డారు. తనకు పార్టీకి ముందు దేశం ముఖ్యం అని ఆ తర్వాతే రాజకీయాలు ఓట్లు అని అమిత్ షా స్పష్టం చేశారు.
"ఒక్కసారి నరేంద్ర మోడీకి అవకాశం ఇవ్వండి బెంగాల్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు"అని అమిత్ షా సభకు తెలిపాడు. అంతేకాదు... బెంగాల్లోని ముస్లిం సోదరులు హిందూసోదరుల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన కర్తవ్యమని అమిత్ తెలిపారు. బెంగాల్ అభివృద్ధి పథంలో నడవాలంటే కాంగ్రెస్ తృణమూల్ స్నేహానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా కోల్కతా ప్రధాన కూడళ్లలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. వాటిపై స్పందించిన అమిత్ షా మమతపై ఫైర్ అయ్యారు. అసలు తమ పార్టీ వ్యవస్థాపకులు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్కు చెందిన వ్యక్తి అయినప్పుడు తామెందుకు బెంగాల్కు వ్యతిరేకంగా ఉంటామని మమతను సూటిగా ప్రశ్నించారు అమిత్ షా.