నేను బీజేపీ సీఎం అభ్యర్థిని కాదు, రాజకీయ నేతను కూడా కాదు: రంజన్ గొగోయ్
గౌహతి: వచ్చే సంవత్సరం జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. తాను రాజకీయ నాయకుడిని కాదని తేల్చి చెప్పారు.
తాను రాజకీయ నేతను కాదని, తనకు అలాంటి కోరిక కూడా లేదని రాజ్యసభ సభ్యులు రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. ఈ ఏడాది రాజ్యసభ సభ్యత్వాన్ని తాను ఆమోదించడం రాజకీయాల్లో లాంఛనంగా ప్రవేశించే దిశగా తీసుకున్న నిర్ణయం కాదని 'ఇండియాటుడే'తో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
రాజ్యసభకు తాను నామినేట్ సభ్యుడనని, రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థిగా తాను నామినేట్ కాలేదన్న విషయం గుర్తుంచుకోవాలని రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. తనకు ఆసక్తి ఉన్న అంశాలపై స్వతంత్రంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడిగా తాను ఉండాలనుకున్నానని, అలా ఉండటం తనను రాజకీయ నేతగా చేసిందా? అని ఆయన ప్రశ్నించారు.
కాగా, వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రంజన్ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థి కావచ్చని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేగాక, రామమందిర తీర్పుపై సంతోషంగా ఉన్న బీజేపీ.. రంజన్ గొగోయ్ కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసిందని, ఆయన ఆ పదవిని ఆమోదించడం చూస్తుంటే ఆయన క్రియాశీల రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్నారని తెలుస్తోందని తరుణ్ గొగోయ్ అన్నారు.
తరుణ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకులకు వయస్సు పెరిగినా.. బుద్ధి పెరగడం లేదంటూ ఘాటుగా విమర్శించింది. ఏం మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో వారికి తెలియడం లేదని మండిపడింది. తరుణ్ గొగోయ్ వ్యాఖ్యలకు కూడా అదే కోవకు చెందుతాయని అస్సాం బీజేపీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్ అన్నారు. తన రాజకీయ జీవితంలో చాలా మంది నాయుకలను చూశానని, అయితే, తరుణ్ గొగోయ్ లాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసే నాయకులను మాత్రం చూడలేదని దుయ్యబట్టారు.