సీఎం రేసులో నేను లేను..ఫడ్నవీస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు: నితిన్ గడ్కరీ
నాగ్పూర్: మహారాష్ట్రలో రాజకీయాలు మలుపులు మీద మలుపులు తీసుకుంటున్నాయి. అసెంబ్లీ గడువు నవంబర్ 9తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలతో పాటు ప్రజల కళ్లు కూడా ముంబైపై పడ్డాయి. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేదానిపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై గడ్కరీ స్పష్టమైన ప్రకటన చేశారు.
సీఎం పదవి పై తేల్చేవరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాదు: శివసేన
ఎన్నికల కంటే ముందు పొత్తు పెట్టుకున్న బీజేపీ శివసేన పార్టీలే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. తాను ఢిల్లీకే పరిమితం అవుతానని చెప్పిన గడ్కరీ... దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని జోస్యం చెప్పారు గడ్కరీ. మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్ చెప్పే దిశగా రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిగుతారనే వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో దీనిపై స్పందించారు గడ్కరీ. ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్కు మహారాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన పార్టీలు కలిసిపోటీ చేయగా ఫలితాల తర్వాత అసలు ఆట మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై ఇరు పార్టీలు ఒక స్పష్టతకు రాకపోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే బుధవారం గడ్కరీని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కలవడం ద్వారా ఏదో జరుగుతోందనే వార్తలు గుప్పుమన్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గడ్కరీతో అహ్మద్ పటేల్ భేటీ అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభనకు పరిష్కారం కనుగొనేలా గడ్కరీని దింపాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్కు లేఖ రాశారు వివసేన నేత కిషోర్ తివారి. అంతేకాదు ఆర్ఎస్ఎస్ మౌనం వహించడంపై మహారాష్ట్రలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పిన కిషోర్ తివారీ.. గడ్కరీ రంగంలోకి దిగితే రెండు గంటల్లో సమస్యను పరిష్కరిస్తారని భగవత్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే నితిన్ గడ్కరీకి ఉద్దవ్ థాక్రేతో మంచి సంబంధాలున్నాయి. 1995 నుంచి 1999 వరకు బీజేపీ-శివసేన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు గడ్కరీ. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతుండగా.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతోందని ఆరోపణలు చేసింది శివసేన. మహారాష్ట్ర ప్రతిష్టంభన నుంచి బయటపడేందుకు బీజేపీ డబ్బులు వెదజల్లుతోందని శివసేన ఆరోపించింది.