యడ్యూరప్ప తీరు ఆశ్చర్యం వేసింది.., 38మంది మాతోనే ఉన్నారు: కుమారస్వామి
బెంగళూరు: మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకుముందు జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఈ విషయంలో బీజేపీపై బహిరంగంగానే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100కోట్లు ఆఫర్ చేసి బీజేపీ ప్రలోభ పెడుతోందని ఆయన ఆరోపించారు. తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడారు.'మా ఎమ్మెల్యేలకు భద్రత కల్పించడం మా బాధ్యత. యడ్యూరప్ప చేస్తున్న పనులకు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతోంది.
ప్రమాణస్వీకారం చేయడమే ఆలస్యం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. బీజేపీ కదలికలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇకపోతే మా 38మంది ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు' అని కుమారస్వామి చెప్పారు.
రాజ్యాంగబద్దంగానే చేశాం: ప్రకాశ్ జవదేకర్
కర్ణాటకలో బీజేపీ చేసిందంతా రాజ్యాంగ బద్దంగా నడిచిన వ్యవహారమేనని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యేల మీదే నమ్మకం లేదని అందుకే రిసార్టుకు తరలించిందని విమర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్ రెండూ బీజేపీని చూసి భయపడుతున్నాయని అన్నారు.
బీజేపీకి ఏ ఎమ్మెల్యే చిక్కడు:
'బీజేపీ నేతలు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అనైతికం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దం. అయితే బీజేపీ బేరసారాలకు ఏ ఎమ్మెల్యే చిక్కడు.' అని మాజీ సీఎం సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు.
ఇకపోతే.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు నిరసనగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ లేదా కొచ్చికి
కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. రేపటి వరకు మేము ఎదురుచూస్తాం. న్యాయం మావైపే ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక పరిణామాలపై కదలిక మొదలైంది. గోవా, మణిపూర్, మిగతా రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించిన రాజకీయ పార్టీలన్ని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. అని కాంగ్రెస్ సీనియర్ నేత డీకె శివకుమార్ వెల్లడించారు. బీజేపీ ప్రలోభాలకు చిక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి లేదా కొచ్చికి తరలిస్తున్నట్టు శివకుమార్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఆర్జేడీపై మంగళ్ పాండే:
కర్ణాటకలో జరిగినట్టే.. బీహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆర్జేడీ తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడాన్ని బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే తప్పు పట్టారు. నిరుద్యోగులంతా పనికోసం చూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఓటమి బాధ నుంచి వారు ఇంకా తేరుకోలేదన్నారు. ఇదంతా పనికిమాలిన వ్యవహారమని, బీహార్ లో తాము ఇదివరకే మెజారిటీ నిరూపించుకున్నామని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 8నెలల తర్వాత ఇప్పుడెందుకు ఈ గోల అని మండిపడ్డారు.