సంతోషంగా లేను, దేవుడి దయ.. ఎన్ని రోజులు ఉంటానో: కుమారస్వామి కంటతడి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టారు. తన అన్ననో.. తమ్ముడో ముఖ్యమంత్రి అయినట్లుగా తన పార్టీ నేతలు సంతోషపడుతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే కాంగ్రెస్తో పార్టీ జతకట్టినందున ఈ సంకీర్ణ ప్రభుత్వంలో పరిణామాలు తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని వాపోయారు.
మీరు సంతోషంగా ఉన్నా నేను లేను, కుమారస్వామి కంటతడి
కుమారస్వామి సీఎంగా అయినందున పార్టీ నేతలు ఆయనకు శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన కుమారస్వామి బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి నిరాకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీ అన్నయ్యో.. తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారని, కానీ నేను సంతోషంగా లేనని, నేను నిత్యం బాధను దిగమింగుతున్నానని, అది విషం కంటే ఏమీ తక్కువ కాదని, ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేనని, ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేనని కన్నీళ్లు పెట్టుకున్నారు.
దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ ఎన్ని రోజులో
ఎన్నికల ప్రచారం సమయంలో తాను ఎక్కడకు వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని, అదేమీ అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడం మరిచిపోయారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడైతే తనకు అధికారం ఇచ్చాడని, నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు.
రెండు గంటల్లో రాజీనామా చేయగలను
గత నెల రోజులుగా రైతుల రుణమాఫీ కోసం అధికారులతో మాట్లాడుతున్నానని, ఈ విషయం ఎవరికీ తెలియదని కుమారస్వామి అన్నారు. అన్నభాగ్య కింద ఇప్పుడు ఐదు కిలోల రైస్ బదులు 7 కిలోల రైస్ కావాలని అడుగుతున్నారని, కానీ రూ.2500 కోట్లు ఎక్కడి నుంచి తీసుకు రావాలని, అలాగే ట్యాక్స్ వేస్తున్నందుకు విమర్శలు వస్తున్నాయని, రుణమాఫీపై తనకు స్పష్టత లేదని మీడియా ఆరోపిస్తోందని, నా వల్ల కాదనుకుంటే రెండు గంటల్లో రాజీనామా చేయగలనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొడుకు ఆరోగ్యంపై దేవేగౌడ కలత
కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ తన కొడుకు కుమారస్వామి ఆరోగ్యంపై కలత చెందుతున్నారు. విశ్రాంతి లేకుండా ఏకదాటిగా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కుమారస్వామి ఆరోగ్యం అంతంత మాత్రమే కావడంతో ఈ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని విచారిస్తున్నారు.