ప్రజలను చూసి గర్వపడుతున్నా.. 10 వారాల కార్యక్రమం సక్సెస్, తగ్గిన ఆ బెడద, అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ వాసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. వారు చేపట్టిన చర్యలతో డెంగ్యూ మహమ్మరి నుంచి రోగులు బయటపడగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 1,100 డెంగ్యూ కేసులు నమోదైన.. ఒక్కరు మృతిచెందలేదని పేర్కొన్నారు. వారంతా కోలుకుంటున్నారని, పరిసరాలను పరిశ్రుభంగా ఉంచాలనే తన పిలుపునకు స్పందించి చర్యలు తీసుకోవడంతో మహమ్మారి బారి నుంచి బయటపడ్డామని చెప్పారు.
2015లో అలా 2019లో ఇలా
2015లో ఢిల్లీలో డెంగ్యూ రక్కసి జడలు విప్పి నాట్యం చేసింది. దాదాపు 15 వేల మందికి డెంగ్యూ సోకినట్టు వైద్యులు పేర్కొన్నారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 60 మంది చనిపోయారు. ఇది అప్పట్లో కలకలం రేపింది. దీంతో ఏం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆలోచించి.. ప్రణాళిక రచించింది. అందుకు పరిసరాల పరిశుభ్రత ఒక్కటే నివారణ మార్గం అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుర్తించారు.
10 వారాలపాటు..
ఆ తర్వాత దోమల విజృంభణను అడ్డుకోవాలని కేజ్రీవాల్ భావించారు. దీంతో 10 వారాలు, ఉదయం 10 గంటలకు, 10 నిమిషాల పాటు మన పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఉదయం లేవగానే తమ డ్రైనేజీని పరిశీలించాలని.. నీరు వృథగా పారుతుంటే అరికట్టాలని కోరారు. ఆ నీటిని డ్రైనేజీలోకి మళ్లించాలని.. దీంతో దోమల ఉత్పత్తి కాదని గుర్తుచేశారు.
వారానికోసారి తనిఖీ..
దీంతోపాటు ప్రతీ ఆదివారం రోజున తమ పరిసరాలను పరిశీలించాలని కోరారు. తమ ఇంటి సమీపంలో కూడా నీరు వృథాగా వెళ్లితే డ్రైనేజీకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలా మీరు కేటాయించే 10 నిమిషాలు.. మీ బంగారు భవిష్యత్లో ఎలాంటి ఆటంకాలు కలుగవని చెప్పారు. కేజ్రీవాల్ పిలుపుమేరకు ప్రజలు స్వచ్చందంగా స్పందించారు. దోమల బెడద నివారణకు సరైన చర్యలు తీసుకున్నారు.
తగ్గిన బెడద..
దీంతో ఢిల్లీలో డెంగ్యూ జ్వరాలను ప్రబలే దోమల బెడద తగ్గింది. డెంగ్యూ కేసుల సంఖ్య కూడా భారీస్థాయిలో తగ్గిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అరవింద్ కేజ్రీవాల్ వీడియో పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలకు అభినందనలు అంటూ ప్రసంగించారు. దోమల నివారణ కోసం హస్తిన ప్రజలు తీసుకున్న చర్యలు చూసి గర్వపడుతున్నాని చెప్పారు. ఒక్క భారతే కాదు ప్రపంచంలో 100 దేశాలు డెంగ్యూ రక్కసితో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు.
హస్తినలోనే..
ఢిల్లీలో ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలను దేశంలో మిగతా రాష్ట్రాలు చేయలేదన్నారు. ప్రపంచంలో కూడా మరే దేశం చేయలేదని తేల్చిచెప్పారు. మిగతా చోట కూడా మన లాగా అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 10 వారాల క్రితం ప్రారంభించిన కార్యక్రమం మంచి సత్పలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమంలో ప్రముఖులు, సినీరంగానికి చెందినవారు, క్రీడాకారులు, జర్నలిస్టులతో సహా సాధారణ పౌరులు కూడా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు.