వారి ఆశీర్వాదం లేనిదే ఏ పనీ అయ్యేలా లేదు: యడ్యూరప్ప
బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది భారతీయ జనతాపార్టీ. 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహించిన ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్కు చెందిన 13 మంది, జేడీఎస్కు చెందిన ముగ్గురు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో సంకీర్ణ కూటమి ప్రభుత్వ పుట్టి మునిగింది. ఫలితంగా- పదవి నుంచి కుమారస్వామి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో బీజేపీ గద్దెనెక్కడం ఇక లాంఛన ప్రాయమే. ఈ నేపథ్యంలో- ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోవడం ఖాయమైంది.
రాజకీయాలకు దూరం: తిరుమలలో పీసీసీ చీఫ్ రఘువీరా
కాగా- పార్టీ అధిష్ఠానం నుంచి తనకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని యడ్యూరప్ప వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం బెంగళూరు చామరాజపేట లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయాన్ని సందర్శించారు. సంఘ్ పరివార్ పెద్దలతో భేటీ అయ్యారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ- సంఘ్ పరివార్ పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. వారి ఆశీర్వాదం లేనిదే ఏ పనీ అయ్యేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే- తాము ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, సభాధ్యక్షుడిని ఎన్నుకుంటామని అన్నారు.
ఆపరేషన్ కమల వల్లే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచామంటూ వస్తోన్న ఆరోపణలను యడ్యూరప్ప తోసిపుచ్చారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో అంతర్గత కలహాలే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. కోట్ల రూపాయలను వెదజల్లి కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామని అనడంలో అర్థం లేదని చెప్పారు. వారిలో వారికే విభేదాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు తాము ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని యడ్యూరప్ప పేర్కొన్నారు. బలపరీక్ష నుంచి తప్పించుకోవడానికి కుమారస్వామి అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అందుకే తీవ్ర జాప్యం చోటు చేసుకుందని అన్నారు. ఎట్టకేలకు ప్రజాస్వామ్యమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.