నీరా రాడియా మా ఇంటికి వస్తుండేది: రాజా
న్యూఢిల్లీ: కార్పోరేట్ లాబీయిస్టు నీరా రాడియాను తాను కలుసుకున్నట్లు 2జి స్పెక్ట్రమ్ కేసు నిందితుడు, మాజీ టెలికం మంత్రి ఏ. రాజా అంగీకరించారు పనికి సంబంధించి ఆమెతో పాటు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాను కూడా కలుసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, తాను ఫోన్లో సంభాషణ జరపలేదని చెప్పారు.
టాటా గ్రూప్ పనులు గురించి నీరా రాడియా తమ ఇంటికి వస్తుండేదని ఆయన అన్నారు. సిబిఐ కోర్టులో సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఆయన చెప్పారు. మంత్రివర్గం కూర్పు గురించి తాను రాజాతో టెలిఫోన్లో మాట్లాడినట్లు, టాటా గ్రూప్ తరఫున 2008లో తాను రాజాను కార్యాలయంలో కలిశానని నీరా రాడియా ప్రాసిక్యూషన్ సాక్షిగా 2013 జులైలో చెప్పారు.
కళంగైర్ టీవీ షేర్ హోల్డిండ్ పద్ధతి గురించి తనకు తెలియదని రాజా చెప్పారు. ఇతర పార్లమెంటు సభ్యులతో పాటు ఓ పార్లమెంటు సభ్యురాలిగా తన ఇంటికి వచ్చినప్పుడు కనిమొళిని కలిసినట్లు ఆయన తెలిపారు. కళైంగర్ గురించి రాడియాతో గానీ కనిమొళితో గానీ మాట్లాడలేదని స్పష్టం చేశారు.
రాజా క్రాస్ ఎగ్జామినేషన్ మంగళవారంనాడు జరుగుతుంది. స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో రాజా విచారణను ఎదుర్కుంటున్నారు.