మోడీ హవాతో వారు చిత్తు: నిలబడ్డ జయ, దీదీ, కెసిఆర్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ తడాఖా చూపించింది. స్వతంత్ర భారత దేశంలో తొలిసారి బిజెపి సొంత మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెసు పార్టీ మినహా ఇప్పటి వరకు ఏ పార్టీ కేంద్రంలో సొంతగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేదు. గత రెండు పర్యాయాలు కాంగ్రెసు కూడా సంకీర్ణ ప్రభుత్వాన్నే నడిపింది. కానీ, అనూహ్యంగా మోడీ హవాతో ఈసారి బిజెపి సొంతగా మేజిక్ ఫిగర్ దాటింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీ హవా స్పష్టంగా కనిపించింది. దక్షిణాదిన కూడా కొంత బిజెపి పుంజుకుంది. బిజెపి లేదా మోడీ హవాకు పదేళ్లుగా కేంద్రంలో మంత్రులుగా పని చేసిన వారు, ఆయా రాష్ట్రాల్లో పట్టున్న పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి. ఇదంతా మోడీ హవా వల్లనేనని పలువురు అంగీకరిస్తున్నారు. మోడీ హవా ధాటికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓటమి పాలయింది. ఢిల్లీలో గత ఏడాది ఎఎపి గెలిచి సంచలనం సృష్టించినా.. ఇప్పుడు అది పునరావృతం కాలేదు.
ఢిల్లీలో క్లీన్ స్వీప్
మోడీ ధాటికి న్యూఢిల్లీని బిజెపి క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో 7 లోకసభ స్థానాలు ఉంటే ఏడింట ఆ పార్టీయే గెలిచింది. ఢిల్లీతో పాటు గోవాలను బిజెపి క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఉత్తర ప్రదేశ్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ), ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) బిజెపి ధాటికి కకావికలమయ్యాయి. కాంగ్రెసు పార్టీ నామమాత్రంగా గెలిచింది.
తుడిచి పెట్టుకుపోయిన బిఎస్పీ, ఎస్పీ, జెడియు
ఉత్తర ప్రదేశ్లో మొత్తం 80 లోకసభ స్థానాలు ఉంటే.. బిజెపి 72 లేదా 73 స్థానాలు గెలుచుకుంటోంది. మోడీ ధాటికి బిఎస్పీ, ఎస్పీలు కొట్టుకుపోయాయి. కాంగ్రెసు పార్టీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఉన్న అమేథీ, రాయ్ బరేలీలు రెండు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో బిజెపి ముందు మిగతా పార్టీలు నిలువలేకపోయాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెసు పార్టీకి ఊరట లభించింది. జమ్ముకాశ్మీర్లో బిజెపి సీట్లు కైవసం చేసుకుంది. ఉత్తరాదిన సత్తా చాటిన బిజెపి దక్షిణాదిన అంత ప్రభావం చూపకపోయినప్పటికీ గతంలో కంటే మెరుగైన సీట్లు సాధించింది. ఇది ముందు ఊహించినదే.
బీహార్లో నితీష్ కుమార్కు గట్టి షాక్ తగిలింది. బీహార్లో అధికారంలో ఉన్న జెడియు పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. బీహార్ను బిజెపి ముప్పైకి పైగా సీట్లు గెలుచుకుంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో కొన్ని సీట్లు గెలుచుకుంది. 2009లో ఎపి నుండి బిజెపికి ఒక్క సీటు కూడా లేదు. అయితే ఎపిలో బిజెపి నేతృత్వంలో గల ఎన్డీయే కూటమిలో ఉన్న టిడిపి 14 లోకసభ స్థానాలను గెలుచుకోనుంది.
నిలదొక్కుకున్న జయ, మమత, కెసిఆర్
మోడీ హవా ముందు హేమాహేమీలు ఓడిపోగా, కాంగ్రెస్, బిఎస్పీ, ఎస్పీ, జెడియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తుడిచి పెట్టుకుపోగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో అన్నాడిఎంకె, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలు నిలదొక్కుకున్నాయి. అన్నాడిఎంకె 37, తృణమూల్ కాంగ్రెస్ 34, తెరాస 11 సీట్లను గెలుచునే అవకాశం కనిపిస్తోంది.