మూడు మంత్రి పదవులు డిమాండ్ చేశానని చెప్పడం అవాస్తవం: నితీష్ కుమార్
బీహార్ : మోడీ కేబినెట్లో జేడీయూకు ఒక మంత్రి పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అయితే ఏదో పేరుకు మంత్రి పదవి ఇస్తామంటే ఆ పదవి తమకు అక్కర్లేదని తేల్చి చెప్పారు నితీష్ కుమార్. అదే సమయంలో మోడీ మంత్రివర్గంలో కొనసాగమని అయితే ఎన్డీయే మిత్రపక్షంగా మాత్రం ఉంటామని నితీష్ స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన నితీష్ కుమార్... బీజేపీ జేడీయూల మధ్య బంధం కొనసాగుతుందని చెప్పారు. అయితే తమకు మూడు మంత్రి పదవులు కావాలనే డిమాండ్ ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. ఎన్డీయే మిత్ర పక్షాలకు ఒక్కో మంత్రి పదవి ఇస్తామని అమిత్ షా చెప్పినప్పుడే ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు నితీష్ కుమార్ చెప్పారు. ఇక జేడీయూ అధికార ప్రతినిధి పవన్ వర్మ కూడా తమ పార్టీ మోడీ ప్రభుత్వంలో చేరడం లేదని వివరించారు.
ఇక బీజేపీ ఇచ్చిన ఆఫర్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది జేడీయూ. అదికూడా ప్రాధాన్యత లేని పోర్ట్ఫోలియో ఇవ్వడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 లో జేడీయూ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత కూడా మోడీ కేబినెట్లో చేరలేదు. అయితే ఈసారి బీజేపీ మిత్రపక్షంగా బీహార్లో 17 సీట్లలో పోటీచేసిన జేడీయూ 16 సీట్లను కైవసం చేసుకుంది. ఈసారి మంచి ప్రాధాన్యత ఉన్న పోర్ట్ఫోలియో కలిగిన మంత్రి పదవులను జేడీయూ ఆశిచింది. అయితే పేరుకు ఒక్క మంత్రి పదవి ఇవ్వడాన్ని జేడీయూ వ్యతిరేకించింది.