ఒక్క రూపాయి ఫీజు ఇవ్వాల్సి ఉంది: ప్రముఖ లాయర్ సాల్వేతో సుష్మా చివరిమాటలు
న్యూఢిల్లీ: మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో యావత్ భారతావని ఒక్కసారిగా షాక్కు గురైంది.ఇక ఆమెతో కలిసి పనిచేసినవారు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకున్నారు. సుష్మా స్వరాజ్తో తమ అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఇక విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ ఆ శాఖకే గొప్ప పేరును తెచ్చి పెట్టారు. భారత్తో ముడిపడి ఉన్న ఇతర దేశాల సమస్యలను తన మేధో శక్తితో పరిష్కరించగలిగారు. ఇక ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అత్యంత కీలకమైన కేసు కుల్భూషణ్ జాదవ్ కేసు. ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తున్నారు. హరీష్ సాల్వేను కేసు వాదించాల్సిందిగా అప్పట్లో సుష్మా స్వరాజ్ నియమించారు. అయితే ఫీజుగా ఒక్కరూపాయే తీసుకుంటానని హరీష్ సాల్వే చెప్పారు. అయితే చిన్నమ్మ హఠాన్మరణంతో హరీష్ సాల్వే ఒక్కసారిగా కన్నీటి పర్యంత అయ్యారు.
రాత్రి 8 గంటల 45 నిమిషాలకు సుష్మాతో మాట్లాడాను: సాల్వే
సుష్మా స్వరాజ్తో మంగళవారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు మాట్లాడినట్లు హరీష్ సాల్వే చెప్పారు. అంతలోనే ఈ చేదు వార్త వినాల్సి వస్తుందని తాను ఊహించలేదని హరీష్ సాల్వే చెప్పారు. తాను మాట్లాడిన సమయంలో ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని హరీష్ సాల్వే చెప్పారు. అంతేకాదు కుల్భూషణ్ జాదవ్ కేసులో ఒక్క రూపాయి ఫీజును తీసుకోవడం మర్చిపోకండి అంటూ తనతో చెప్పారని చిన్నమ్మ చివరి మాటలను గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సుష్మా స్వరాజ్ మృతి యావత్ దేశానికి తీరనిలోటు అని చెప్పారు.
సుష్మా హయాంలో ఐసీజేకు కుల్భూషణ్ జాదవ్ కేసు
కుల్భూషణ్ జాదవ్ కేసులో పాక్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించడంతో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించింది. ఆ సమయంలో సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్యే మరణశిక్షను తీర్పు పై పునః సమీక్షించాలని దీంతో పాటు కుల్భూషణ్కు భారత కాన్సులర్ యాక్సెస్ కూడా ఇవ్వాలని తీర్పు చెప్పింది. అయితే సాల్వే ధీటుగా వాదించడంతోనే ఈ విజయం సాధ్యమైందని సుష్మా స్వరాజ్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ ఈ కేసును వాదించేందుకు హరీష్ సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు కేసును వాదించేందుకు పెద్ద మొత్తంలో ఛార్జ్ తీసుకునే హరీష్ సాల్వే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకోవడం న్యాయంగా లేదని కూడా సుష్మా అన్నారు. అయితే హరీష్ సాల్వే కంటే తక్కువ ఫీజు తీసుకుని ఇంతకంటే బాగా వాదించే భారతీయ లాయర్లు ఉన్నారని ఓ ట్విటర్ యూజర్ ట్వీట్ చేయడంతో హరీష్ సాల్వే ఫీజు సంగతి బయటకు చెప్పాల్సి వచ్చింది.
స్వచ్చందంగా వాదించేందుకు ముందుకొచ్చిన సాల్వే
ఇదిలా ఉంటే కుల్భూషణ్ జాదవ్ కేసును వాదించేందుకు హరీష్ సాల్వే స్వచ్చందంగానే ముందుకొచ్చి ఒక్క రూపాయికే కేసును టేకప్ చేస్తానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం భారత్ మీద ఉన్న ప్రేమతోనే తన దేశంకోసం ఇది చేశారని సన్నిహితులు చెబుతున్నారు. యావత్ భారత్ దేశం దీనిపై ఆసక్తిగా ఎదరుచూస్తున్న తరుణంలో కేసును వాదించేందుకు హరీష్ సాల్వే స్వచ్చందంగా ముందుకొచ్చినట్లు సమాచారం. హరీష్ సాల్వే నిజమైన దేశభక్తుడు అని చాలా మంది కొనియాడారు. అణ్వాయుధ నిరాయుధీకరణ బాధ్యతలను ఉల్లంఘించిందంటూ మార్షల్ ఐలాండ్స్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయగా హరీష్ సాల్వే భారత్ తరపున వాదనలు వినిపించి కేసులో విజయం సాధించారు.