నలుగురు పిల్లలనే కనమన్నా..40 కుక్క పిల్లలను కాదు: సాధ్వి ప్రాచీ
న్యూఢిల్లీ: వివాదాస్సద వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నేతలకు హెచ్చరికలు చేసినప్పటికీ.. ఆ పార్టీ నేత సాధ్వి ప్రాచీ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. హిందూ మతాన్ని కాపాడేందు కోసం మహిళలు కనీసం నలుగురు పిల్లలనైనా కనాలని ఆమె పేర్కొన్నారు.
ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేను అడిగింది నలుగురు పిల్లలను కనమని. 40 మంది కుక్క పిల్లలను కాదు' అని అన్నారు. బిజెపి అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాది పార్టీ మంత్రి అజాం ఖాన్ను ఘర్ వాపసీ ద్వారా హిందూ మతంలోకి రావాలని సాధ్వి ప్రాచీ ఆహ్వానించడం గమనార్హం.
కాగా, ఈ విషయంపై తాను ఆమెను వ్యక్తిగతంగా కలిశానని ఉత్తరప్రదేశ్ బిజెపి నేత లక్ష్మీకాంత్ భాజ్పాయి తెలిపారు. మత సంబంధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించిన ప్రధాని.. ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అవకాశంగా మారతాయని నేతలకు చెప్పారు. అయినప్పటికీ బిజెపి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానడం లేదు. ఇటీవలే ఓ నేత భారతదేశం హిందూ దేశమని ప్రకటించారు.