మీ బాధను పంచుకోగలను: సంగీత జైట్లీకి సోనియా లేఖ, ఏమన్నారంటే.?
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ బాధను తాను పంచుకోగలను అంటూ అరుణ్ జైట్లీ సతీమణి సంగీత జైట్లీతో అన్నారు. సంగీతను ఆమె స్వయంగా కలిసి పరామర్శించారు.
సంగీతను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అరుణ్ జైట్లీకి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ స్నేహితులేనని, అతడు కూడా అందరి స్నేహితుడు అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మీ ప్రియమైన భర్త అరుణ్ జైట్లీ మరణ వార్తను తీవ్రంగా కలత చెందానని సోనియా గాంధీ.. సంగీతకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు.
'ఆయన ఒక మేధావి. ఆయన మాట తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆయన కేబినెట్ మంత్రిగా పూర్తి శక్తిసామార్థ్యాలతో పనిచేశారు. పూర్తి న్యాయం చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అందరి మన్ననలు అందుకున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా ఆయన రాణించారు' అని సోనియా గాంధీ తన లేఖలో అరుణ్ జైట్లీని కొనియాడారు.
తీవ్రమైన అస్వస్థతతో అరుణ్ జైట్లీ ధైర్యంగా పోరాడి ఓటమిపాలయ్యారు. చిన్న వయస్సులోనే జైట్లీ మరణించడం దేశానికి తీరని లోటు అని సోనియా గాంధీ అన్నారు. సానుభూతి తెలపడంతో సరిపెట్టుకోలేను.. మీ, మీ కూతురు, మీ కుమారుడు బాధను అర్థం చేసుకోలను. అరుణ్ జీకి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని సంగీతా జైట్లీకి రాసిన లేఖలో సోనియా పేర్కొన్నారు.
గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. అరుణ్ జైట్లీ మృతి తనను ఎంతో బాధకు గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు రాహుల్ సానుభూతి తెలిపారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మెరుగైన సమాజం కోసం జైట్లీ ఎప్పుడూ పోరాడేవారని కొనియాడారు.