కాగ్నిజెంట్కు ఐటీ షాక్: బ్యాంకు ఖాతాల నిలిపివేత.. ఎందుకు?
ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్కు ఆదాయపన్ను శాఖ షాక్ ఇచ్చింది. రూ. 2500కోట్ల పన్ను ఆరోపణల నేపథ్యంలో కంపెనీకి చెందిన పలు ఖాతాలను స్తంభింపజేసింది.
'ఆదాయపన్ను శాఖ చెబుతున్న ప్రకారం.. డివిడెంట్లను పంపిణీ చేసినప్పుడు కచ్చితంగా డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. షేర్స్ బై బ్యాక్ ఆఫర్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది.
2013-2016 వరకు కాగ్నిజెంట్ తన మాతృ సంస్థకు డివిడెండ్లను పంపిణీ చేసింది. ఈ లెక్కన రూ.2500కోట్ల డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే దీనికి పన్ను మాత్రంచెల్లించలేదు.
డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించకపోవడంతో ఇటీవల ఐటీ శాఖ కాగ్నిజెంట్కు పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చినా సంస్థ స్పందించకపోవడంతో త వారం ముంబై, చెన్నైలలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.
కాగా, తాము పన్ను ఎగవేతకు పాల్పడలేదని కాగ్నిజెంట్ చెబుతుండటం గమనార్హం. కంపెనీ ఖాతాలను నిలిపివేయడంపై తాము మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినట్టు కాగ్నిజెంట్ తెలిపింది. ఐటీ చర్యల వల్ల కంపెనీ కార్యకలాపాలేవి నిలిచిపోలేదని సంస్థ వెల్లడించింది.