నీరవ్ మోడీ షోరూంలో కొనుగోళ్లు: అభిషేక్ సింఘ్వీ భార్యకు నోటీసు
న్యూఢిల్లీ: నీరవ్ మోడీపై కేసు నమోదైన నేపథ్యంలో ఆదాయం పన్ను శాఖ కాంగ్రెసు సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య అనితా సింఘ్వీకి నోటీసు జారీ చేసింది. నీరవ్ మోడీకి చెందిన షోరూం నుంచి 6 కోట్ల విలువ చేసే ఆభరణాల కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఐటి శాఖ నోటీసులో తెలిపింది.
అయితే, ఆ ఆరోపణలను అభిషేక్ సింఘ్వీ ఖండించారు. తాను ప్రతిపక్ష పార్టీకి చెందినవాడిని కాబట్టి తనను వేధించడానికే తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఆమెకు నోటీసు ఇందుకు..
అనితా సింఘ్వీకి మంగళవారం నోటీసు జారీ అయింది. కొన్నేళ్ల క్రితం వజ్రాల కొనుగోళ్లకు ఏంత నగదు రూపంలో, ఎంత చెక్ రూపంలో ఇచ్చారో తెలియజేయాలని ఐటి శాఖ ఆమెను ఆదేశించింది.
నీరవ్ పన్ను ఎగవేతపై విచారణలో..
అనితా సింఘ్వీ 1.5 కోట్లు చెక్ రూపంలోనూ 4.8 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించినట్లు ఐటి శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఆ లావాదేవీలకు సంబంధించిన వివరాలు కావాలనేది ఐటి శాఖ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. నీరవ్ మోడీ ఎగవేసిన పన్నుపై విచారణలో భాగంగా ఏ మేరకు ఆ లావాదేవీల్లో పన్ను ఎగవేశారో తెలుసుకోవాలనేది కూడా ఐటి శాఖ భావనగా చెబుతున్నారు.
సింఘ్వీ మండిపాటు
ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని, చట్ట ప్రకారం ఐటి నోటీసుకు ప్రతిస్పందిస్తామని అభిషేక్ సింఘ్వీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన భార్య నగదు ద్వారా ఆభరణాలు కొనుగోలు చేసినట్లు ఎవరి కంప్యూటర్ ఎంట్రీయో సాక్ష్యం కాదని, మొత్తం 1.56 కోట్లు చెక్ రూపంలోనే చెల్లించామని, భారత్ అత్యధిక పన్ను చెల్లింపుదారునైన తన వద్ద రిసీట్స్ లెక్కలు ఉన్నాయని అభిషేక్ సింఘ్వీ అన్నారు.
నిర్మలా సీతారామన్పై గతవారం
సింఘ్వీ భార్య అనితా సింఘ్వీ డైరెక్టర్గా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్లోని ప్రాపర్టీని నీరవ్ మోడీకి చెందిన ఫైర్స్టోన్ డైమండ్ లీజుకు తసుకుందనే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణ చేశారు. దానిపై సింఘ్వీ తీవ్రంగా మండిపడ్డారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి చెందిన స్థలంలో ఐదేళ్ల క్రితం నీరవ్ మోడీకి చెందిన కంపెనీ అద్దెకు తీసుకున్నారనీ, ఈ ఒప్పందం 2017 డిసెంబరుతోనే ముగిసిపోయినట్టు స్పష్టం చేశారు.
ఆరోపణలకు సింఘ్వీ ఖండన
నీరవ్ మోడీకి చెందిన ఓ కంపెనీలో తన కుటుంబీకులకు షేర్లు ఉన్నాయన్న ఆరోపణలను ఆయన గతవారం తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై పరువు నష్టం దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటానని..
నిర్మలా సీతారామన్ చేసిన నిరాధార ఆరోపణలను ప్రచురించే అన్ని మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు గానీ, తనభార్య, కుమారుడికిగానీ గీతాంజలి, నీరవ్ మోడీతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలు పౌర, క్రిమినల్ సహా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సింఘ్వీ చెప్పారు.